ఎత్తులకు పైఎత్తు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ దారి పడుతోందిగా..!
రంగారెడ్డి : రాజకీయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎత్తులకు పైఎత్తులు వేస్తుండాలి. ప్రత్యర్థులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే రాత్రికి రాత్రే పొలిటికల్ కెరీర్కు ఫుల్స్టాప్ పడే ప్రమాదముంది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హవాకు కాంగ్రెస్ ఢీలా పడింది. కారు జోరుకు చేయి వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అదలావుంటే టీఆర్ఎస్కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ పెద్దలు రూట్ మార్చుతున్నారు. అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనే అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసేలా కాంగ్రెస్ లీడర్లు స్కెచ్చులేస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించిన వ్యూహం ఔరా అనిపిస్తోంది.
ఏంది సుధాకరన్నా.. అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. అందుకేనా కాంగ్రెస్కు గుడ్బై..!
టీఆర్ఎస్ ఎత్తులను కాంగ్రెస్ చిత్తు చేసేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కాబొర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కోలేక చతికిలపడుతున్నారు. పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో కూడా జనాకర్షక కార్యక్రమాలు చేయడం లేదనే వాదనలున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ కోలుకోవాలంటే చాలా టైమ్ పడుతుందనే టాక్ లేకపోలేదు.
అవన్నీ అలా ఉంటే.. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల నామినేషన్ సందర్భంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం హాట్ టాపికయింది. పార్టీని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం..!
చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ మార్క్ రాజకీయం చూపించారనేది చర్చానీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల చివరి సమయంలో సడెన్గా రూట్ మార్చారు. అప్పటికే పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఉదయ్ మోహన్ రెడ్డిని పక్కన పెట్టేశారు. అప్పటికప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
ఏఐసీసీ ఆమోదం పొందిన తర్వాత కూడా అభ్యర్థిని మార్చడం హాట్ టాపికయింది. ఉదయ్ మోహన్ రెడ్డి స్థానంలో కొమ్మూరి ప్రతాప్రెడ్డిని అనూహ్యంగా తెరపైకి తేవడం క్యాడర్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
టీఆర్ఎస్కు చెక్ పెట్టడానికే..!
నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను.. కాంగ్రెస్ తరపున మూడు చోట్ల రెడ్డి అభ్యర్థులను రంగంలోకి దించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేదాకా కాంగ్రెస్ పార్టీ పెద్దలు వెయిట్ చేశారు. టీఆర్ఎస్ మూడు స్థానాలకు రెడ్డి అభ్యర్థులను బరిలోకి దించడంతో.. కాంగ్రెస్ లీడర్లు సైతం రెడ్లకే టికెట్లు కేటాయించారు. టీఆర్ఎస్ రంగంలోకి దించిన రెడ్డి అభ్యర్థులకు దీటుగా.. అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులైతే టఫ్ ఫైట్ ఉంటుందని భావించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పట్నంతో సంబంధాలు..! అందుకేనా ఈ వ్యూహం..!
అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం అనూహ్యంగా అభ్యర్థిని మార్చడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తొలుత ప్రకటించిన ఉదయ్ మోహన్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి శిష్యుడు. అప్పట్లో పట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఉదయ్ జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా పనిచేశారు. అయితే పట్నం గులాబీ గూటికి చేరడం.. ఉదయ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కూడా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనేది కాంగ్రెస్ నేతల వాదన.
ఉదయ్ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వంపై జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఆయనకు లేదని.. ఆర్థికంగా కూడా అంత బలంగా లేరనేది వారి వాదన. అదలావుంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు కూడా పెద్దగా ఇష్టం లేదట. ఏది ఏమైనా నామినేషన్ల చివరి సమయంలో అభ్యర్థిని మార్చడమనేది హాట్ టాపికయింది.
ఇంటర్నల్ వారా?.. మైండ్ గేమా..?
ఆల్ ఆఫ్ సడెన్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అభ్యర్థిని మార్చడంపై మరో వాదన వినిపిస్తోంది. ఉదయ్ మోహన్ రెడ్డి పేరు ప్రకటించగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతులెత్తేశారట. ఒకవేళ కాదు కూడదని ఉదయ్నే బరిలోకి దింపితే.. గెలిపించే బాధ్యత తీసుకోలేమంటూ కుండబద్దలు కొట్టారట. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు తాను సైతమంటూ తెర మీదకు రావడం చర్చానీయాంశమైంది. వీటన్నింటి నేపథ్యంలో చివరాఖరికి కాంగ్రెస్ పెద్దలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జై కొట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి కారణాలేవైనా.. టీఆర్ఎస్కు చెక్ పెట్టడానికే కాంగ్రెస్ లీడర్లు మైండ్ గేమ్ ఆడారనే చర్చ జోరుగా సాగుతోంది.