రేణుకా చౌదరిపై ఫిర్యాదు, ఆ హెలికాప్టర్ మాటేంటి: కెటిఆర్పై రాథోడ్
అదిలాబాద్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి పైన ఆ పార్టీ నేతలు వి హనుమంత రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మంగళవారం నాడు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు.
రాబోయే ఎన్నికలలో పార్టీ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా ఎడవెల్లి కృష్ణయ్య పేరును బహిరంగ సభలో రేణుక ప్రకటించారు. అధిష్టానం అనుమతి లేకుండా అభ్యర్థిని ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్గీకి ఫిర్యాదు చేశారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అరాచక పాలన: దిగ్విజయ్
తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని దిగ్విజయ్ సింగ్ మంగళవారం విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కర్నాటక ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా రిజిస్టర్ కాని ప్రయివేటు ఫైనాన్సుల పైన కేసులు పెట్టాలన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. దేశంలో బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.
కెటిఆర్ ఆ మాటకు కట్టుబడాలి: రమేష్
జలహారం (వాటర్ గ్రిడ్) పథకంలో అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన కెటిఆర్ ఆ మాటకు కట్టుబడి ఉండాలని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి రమేష్ రాథోడ్ అన్నారు. వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు.
కాంట్రాక్టులు పొందిన వారు మంత్రుల పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్ను సమకూర్చారన్నారు. కెటిఆర్తో పాటు పలువురు మంత్రులు ఆ హెలికాప్టర్లలోనే జిల్లాల్లో పర్యటించారన్నారు. దీనికి మంత్రి కెటిఆర్ ఏం సమాధానం చెబుతారన్నారు.