చిన్న పిల్లల్ని తిడుతారా?, కాంగ్రెస్ దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటు: కేటీఆర్
వనపర్తి: పదే పదే కుటుంబ పాలన అంటూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పై ఐటీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తమది కుటుంబ పాలన అంటూ గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలని మండిపడ్డారు.
శుక్రవారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో 160 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా.. కేటీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చిందెవరు? అని ఈ సందర్బంగా కేటీఆర్ ప్రశ్నించారు. బతుకుదెరువు లేక ఇక్కడివాళ్లను బొంబాయి వలసపోయే లాగా చేసిన ఘనత మీది కాదా? అని నిలదీశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇక్కడి ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తారా? అని మండిపడ్డారు.
ఉత్తమ్ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదా?:
మాట్లాడితే తమది కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ నేతలకు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
'మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, వారి కొడుకు రాహుల్ గాంధీ.. ఇది కాదా కుటుంబ పాలన' అని నిలదీశారు.
పిల్లల గురించి మాట్లాడుతారా:
రాజకీయ విమర్శలే కాదు తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగానూ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మనవడు, మనవరాళ్లను కూడా తిడుతున్నారని, చిన్న పిల్లలపై విమర్శలేంటని ప్రశ్నించారు.
కాగా, గతంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'చిట్టి నాయుడు' అంటూ కేసీఆర్ మనువడిపై సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా అడపాదడపా కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.