అదే మాట నిరూపించండి.. రాజీనామాకి సిద్దం : ఉత్తమ్, సొంతగడ్డవాళ్లే దోచుకుంటున్నారు : జీవన్ రెడ్డి
హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణలో ప్రాజెక్టుల అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రాజెక్టులకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ హయాంలో పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఒకవేళ నిర్వాసితులకు అన్యాయం జరిగినట్టు గనుక నిరూపిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్దమని ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అనవసరంగా మొండి పట్టుదలకు పోయి మల్లన్న సాగర్ నిర్వాసితులకు నష్టం జరిగేలా వ్యవహరించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం గురించి స్పందించారు సీఎల్పీ నేత జానారెడ్డి. భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విలువలు తేల్చిన తర్వాతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదే విషయమై సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన మరో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి.. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని లేఖలో మండిపడ్డారు. ఓవైపు రైతుల కోరిక మేరకే నష్ట పరిహారం ఉంటుందని కేసీఆర్ ప్రకటిస్తే.. హరీశ్ రావు మాత్రం భూసేకరణ చట్టం కంటే జీవో123 మెరుగైనదంటూ.. విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడైజనింగ్ లను తప్పుబట్టిన ఆయన.. పరాయి వాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారో లేదో తెలియదు గానీ నేడు సొంతగడ్డ మీదున్న వారే రీడైజన్ల సాకుతో అందినకాడికి దోచుకుంటున్నారని లేఖలో విమర్శించారు.
మొత్తంగా తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ప్రజలకు అన్యాయం చేసే చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్దంగా లేమని చెప్పారు.