కాంగ్రెస్లో టీఆర్ఎస్ అనుకూల వర్గం, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమమేదీ..? కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు..
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియాను కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ కలిశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఒక్కొక్కటి వివరించారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని కుంతియా దృష్టికి తీసుకెళ్లారు.
నీతి, నిజాయితీగా పనిచేస్తే..
పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవారికి గుర్తింపు లేదని వారు కుంతియా ముందు గోడు వెళ్లబోతున్నారు. ఇలా అయితే పార్టీ మనుగడ ఎలా అని అడిగారు. పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నామని.. కానీ పెద్దల నుంచి మాత్రం సహాయ నిరాకరణే ఎదురవుతోందని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ అనుకూల వర్గం కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
ఆరేళ్లలో ఏం చేశారు..?
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బతికంచాలని ఓ వర్గం పాటుపడుతుందని తమ గురించి ముగ్గురు నేతలు చెప్పుకున్నారు. మరో వర్గం మాత్రం అధికార పార్టీతో లాలూచీ పడుతోందని చెప్పారు. గత ఆరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు ఏంటి అని ఆర్సీ కుంతియాను దామోదర రాజనరసింహ అడిగారు.
కేసీఆర్ గుర్తించారు..
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై తాము ఉద్యమించామని గుర్తుచేశారు. తమ సొంత పార్టీ, పార్టీ నేతలు మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి గుర్తించారని తెలిపారు. తమకు తగిన గౌరవం లభించడం లేదని కుంతియాకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో సరైన వ్యక్తులను నియమిస్తేనే పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని, లేదంటే చతికిలపడటం ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇంచార్జీల విషయంపై కుంతియా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
పిలిచి అవమానించారు..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కపై నేతలు గుర్రుమీదున్నారు. ఇటీవల గవర్నర్ను కలిసే సమయంలో పిలిచి అవమానించారని వీహెచ్ ఆరోపించారు. తాను ఢిల్లీలో ఉంటే రావాలని పిలిస్తే వచ్చానని.. తీరా గవర్నర్ను కలిసే వారిలో తన పేరు లేదని గుర్తుచేశారు. అలాగే పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా లేదని చెప్పారు. ఇక అప్పటినుంచి ఉత్తమ్, భట్టిపై వీహెచ్, పొన్నాల ఆగ్రహాంతో ఉన్నారు.