కాంగ్రెస్ షాకింగ్: చంద్రబాబు కంటే ముందే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు బాంబు పేల్చారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు కంటే ముందే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని కెసిఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని చెప్పే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని పొన్నాల సవాల్ విసిరారు. ఇతర పార్టీల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇందుకు సిఎం కెసిఆర్ బాధ్యుడని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.
డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు బర్తరఫ్ చేశారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీకి చెందిన మంత్రులు, పలువురు అధికారులు సహా దాదాపు 140 నుంచి 160 మందికి చెందిన ఫోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ చేయలేదని తొలుత చెప్పిన టీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత న్యాయస్థానంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేశారని అంగీకరించారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు.. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పడం గమనార్హం.
మరోవైపు, ప్రాజెక్టుల పైన కాంగ్రెస్, టిడిపి నేతలు కెసిఆర్ పైన మండిపడుతున్న విషయం తెలిసిందే. కెసిఆర్ ప్రాజెక్టులను వివాదాసప్దం చేస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రంలో అందరికీ అసంతృప్తేనని, కరవు నివారణ చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని తోటపల్లి ప్రాజెక్టు సాధన దీక్షలో బుధవారం కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.
అల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయమని, ఎత్తు పెంపుకు 1.25 లక్షల ఎకరాలను కర్నాటక సేకరిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద భూసేకరణ అని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే మేల్కొని అడ్డుకోవాలని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, ఎల్ రమణలు అన్నారు.