తెలంగాణలో మొదటిసారి.. పోలింగ్ యంత్రాలపై నిఘా.. కాంగ్రెస్ అలర్ట్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపింది. ప్రజాకూటమి, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగింది పోలింగ్. అందుకుతగ్గట్లుగా ఎగ్జిట్ పోల్స్ కూడా చర్చానీయాంశంగా మారాయి. అయితే మొదట్నుంచి గులాబీనేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఈవీఎం ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేస్తారమోనని ఆరోపణలు చేస్తున్నారు. ఈక్రమంలో వాటిని భధ్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కార్యకర్తలను నిఘా ఉంచేలా ఎన్నికల సంఘం అధికారులు అనుమతివ్వాలని కోరడం చర్చానీయాంశమైంది.
తెలంగాణలో కౌంటింగ్ ఏర్పాట్లు.. లెక్కింపు కేంద్రాలు ఇవే
అటు ఎవరు అడగకముందే ఈవీఎం లపై నిఘా పెట్టుకోవచ్చని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. ఈవీఎం ల నిఘాకు ఆయా రాజకీయ పార్టీలకు పర్మిషన్ ఇచ్చేలా కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు.
ఎన్నడూ లేదు.. ఈసారి కార్యకర్తల "నిఘా"
ఈవీఎం లు భద్రపరించే స్ట్రాంగ్ రూముల దగ్గర మామూలుగా పోలీసులే సెక్యూరిటీ విధులు నిర్వహిస్తుంటారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంల లు భద్రపరుస్తారు. అయితే ఈసారి స్ట్రాంగ్ రూముల దగ్గర తమ కార్యకర్తలతో నిఘా పెట్టేందుకు ఈసీ అనుమతివ్వాలని కోరడం, అంతలోనే అధికారులు ఓకే చెప్పడం చర్చానీయాంశంగా మారింది. ఈవీఎం ల నిఘా కోసం ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈసారి టీఆర్ఎస్ కు ఢీ అంటే ఢీ కొడుతున్న కాంగ్రెస్.. ఈవీఎం ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడైతే ఈవీఎం లు భద్రపరిచారో అక్కడ కార్యకర్తలతో నిఘా పెట్టించేందుకు సిద్ధమైంది.
టీఆర్ఎస్ పై అపనమ్మకం.. ఈవీఎం ల భద్రతపై అనుమానాలు
గతంలో ఎన్నడూ కూడా తెలంగాణ చరిత్రలో ఈవీఎం లకు ఆయా పార్టీల కార్యకర్తలు కాపలా ఉన్న సందర్భాలు లేవు. కానీ ఈసారి కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పావులు కదిపిన కాంగ్రెస్ పెద్దలు ఈవీఎం ల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై నమ్మకం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది హాట్ టాపిక్. గులాబీ నేతలు ట్యాంపరింగ్ చేయొచ్చనే డౌట్ తో కాంగ్రెస్ లీడర్లు స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర నిఘాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహాకూటమి అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈవీఎం ల పైనే ఆశలు పెట్టుకున్నారు. అందులోభాగంగా ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యగా వాటిపై నిఘా పెట్టేందుకు రెడీ అయ్యారు.
గజ్వేల్ ఫలితాలపై వంటేరు అనుమానం..!
గజ్వేల్ లో ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగే ఛాన్సుందని అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. ఈవీఎం లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించిన తర్వాతే గజ్వేల్ ఫలితాలు విడుదల చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ అందించారు. ఒకవేళ ఈసీ అధికారులు స్పందించకుంటే హైకోర్టుకు వెళతానన్నారు.
అనుక్షణం అప్రమత్తం.. విజయం కలిసొచ్చేనా?
అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. దాదాపు నెలరోజులకు పైగా ప్రచారంలో టీఆర్ఎస్ నేతలపై మాటల తూటాలు పేల్చారు. సాధారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉండే ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. అలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న కాంగ్రెస్ లీడర్లు పోలింగ్ అయిపోయాక కూడా అలర్ట్ గా ఉన్నారు. ఈవీఎం ల భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ వాటిని కనిపెట్టుకుని ఉండేందుకు సిద్ధమయ్యారు. ఇంకో రెండు రోజులు అప్రమత్తంగా ఉంటే గెలుపు మనదేనంటూ పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. అటు పోలింగ్ ఇటు కౌంటింగ్ వయా ఈవీఎంలు.. మొత్తానికి తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్ కు కలిసొస్తాయేమో చూడాలి.