కెటిఆర్! ఇది కూడా జోకేనా, కవితకు ఎందుకు?: శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తమ పార్టీ అన్నటువంటి నేతలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుతామంటున్నారని కాంగ్రెస్ నేత శ్రవణ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాలు అడిగితే కేటీఆర్ జోక్ చేశానని అనటం హాస్యాస్పదమన్నారు.
మజ్లీస్తో పొత్తు లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్తున్నారని ఇదీ కూడా జోకేనా అని ఆయన ప్రశ్నించారు. గిరిజన ఎంపీలకు లేని రక్షణ కవితకు మాత్రం ఎందుకని శ్రవణ్ అడిగారు.
మోడీని పక్కన పెట్టినట్లే...
ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని పక్కనపెట్టినట్టుగా హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ను ఓడిస్తారని కాంగ్రెస్ నేత మల్లు రవి జోస్యం చెప్పారు. హైదరాబాద్లో ఉన్న సెటిలర్లు, నాన్సెటిలర్లను కలుపుకునివెళ్లే శక్తి కాంగ్రెస్కే ఉందని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఫాస్ట్ పథకం తెచ్చి ఇబ్బందులు పెట్టాలని చూసిందని ఆయన అన్నారు. వరంగల్ ఎన్నికలకు, గ్రేటర్ ఎన్నికలకు తేడా ఉందని మల్లు రవి చెప్పారు.
హాస్యాస్పదం...
గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందని మంత్రి కెటిఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత వేం నరేందర్రెడ్డి అన్నారు. 2009లో గ్రేటర్లో టీఆర్ఎస్ పోటీ కూడా చేయలేకపోయిందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో గుర్తు చేశారు. 2014లో గ్రేటర్ పరిధిలో మెజారిటీ సీట్లు టీడీపీ-బీజేపీ కూటమే గెలుకుంటుదని నరేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. కో-ఆప్షన్ సభ్యులను అడ్డుపెట్టుకుని మేయర్ పదవిని దక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన చెప్పారు. ఆ అభివృద్ధి ఫలాలు పొందిన ప్రజలంతా మాకే ఓటేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.