టిడిపితో పొత్తుపై కాంగ్రెస్లో భిన్నస్వరాలు! 'వరంగల్లో టిఆర్ఎస్ బెదిరింపు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై కాంగ్రెస్ పార్టీలో భిన్నరాగాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కూడా సిద్ధమేనని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల పైన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన లేదని స్పష్టం చేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
భయభ్రాంతులకు గురి చేశారు
ఓటమి పైన పార్టీలో లోతుగా విశ్లేషించుకుంటామన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రభావితం చేసిందని, వరంగల్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మల్లుభట్టి అన్నారు. తమకు ఓటు వేయకుంటే పింఛన్లు, రుణమాఫీ ఆపేస్తామని టిఆర్ఎస్ పార్టీ బెదిరించిందన్నారు.
ఓటర్లను ఒత్తిడికి గురి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య తీర్పును తాము స్వీకరిస్తామని చెప్పారు. టిఆర్ఎస్ భయపెట్టి ఓట్లు వేయించుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘటన ఉప ఎన్నిక పైన ప్రభావం చూపిందన్నారు. ఎన్నికల హామీలను అన్నింటిని నెరవేర్చకుంటే ఓట్లు అడగనని కెసిఆర్ చెప్పాలని మల్లు భట్టి డిమాండ్ చేశారు. కాగా, ఓటర్లను టిఆర్ఎస్ భయభ్రాంతులకు గురి చేసిందని, మీరు మాకు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని షబ్బీర్ అలీ కూడా వ్యాఖ్యానించారు.