స్పీకర్ వద్దకే కాంగ్రెస్..! ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు తప్పని తిప్పలు..!!
Recommended Video
బాన్స్ వాడ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని కోరారు. బాన్స్ వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి డిస్ క్వాలిఫికేషన్ నోటీస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్ తో కలిసి భట్టి విక్రమార్క అందజేసారు. అనంతరం స్పీకర్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ మాట్లాడుతూ స్పీకర్ కు వినతి పత్రం అందించేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు.
ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం..! ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్న కాంగ్రెస్..!!
పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో 6 మంది ఎమ్మెల్యేలని డిస్ క్వాలిఫై చేయాలని గతంలో పిటీషన్ ఇచ్చాము.. అలాగే హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జాలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పట్టపగలే ఖూనీ చేస్తోందని ఘాటుగా విమర్శించారు.
తక్షణం డిస్ క్వాలిఫై చేయాలి..! స్పీకర్ కు వినతి పత్రం అంజేసిన టీపిసిసి..!!
అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. అనేక ప్రలోభాలకు గురిచేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరినట్లు ఆయన చెప్పారు. అందుకు సంబంధించి పదో షెడ్యూల్ వివరాలను, అఫిడవిట్ ను స్పీకర్ కు అందించినట్లు భట్టి వివరించారు.
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు..! ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపణ..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దీనిని ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తామని కొందరు టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యహారం అని.. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం అయిన సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకూ అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపి.. ఆ తరువాత విలీనం చేయడం జరిగిందని అన్నారు. స్పీకర్ గారు హైదరాబాద్ లో లేకపోవడం వల్ల వారి నివాసం అయిన బాన్స్ వాడలో ఆయనను కలసి ఇచ్చామని వివరించారు.
ఎమ్మెల్యేలకు నజరానాలు ఇస్తున్నారు..! ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న హస్తం పార్టీ..!!
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన ఇంట్లో కలిసి కోరినట్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. డిస్ క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫోటో తీడుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు నజరానాలు ఇస్తూ ఆకర్షిస్తున్నారని షబ్బీర్ అలీ చెప్పారు. జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాగా శాసన సభలో ఇదే ఫిర్యాదు పత్రాలను తీసుకునేందుకు అసెంబ్లీ కార్యదర్శి వెనకడుగు వేసాడని, ఇది తన పరిదిలోకి రాదని వారిని అక్కడ నుంచి పంపించివేసారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. డిప్యూటీ స్పీకర్ కూడా తమ నివేదికను తీసుకోవడానికి నిరాకరించారని వారు చెప్పుకొచ్చారు.