ఏంటిది: జానారెడ్డికి రూ.5 భోజనం చిక్కు, రేవంత్ రెడ్డికి చిక్కిన కెసిఆర్!
హైదరాబాద్: రూ.5కే భోజనంపై తెరాస ప్రభుత్వానికి తెలంగాణ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి కితాబు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జానారెడ్డి వ్యవహరించిన ఈ తీరు తెలంగాణ కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురి చేస్తోంది.
గురువారం తన కార్యాలయానికి రూ.5 భోజనం తెప్పించుకుని తిన్న జానారెడ్డి.. చాలా బావుందని కితాబిచ్చారు. మీరు కూడా తినండంటూ.. మీడియా వారిని కూడా కోరారు. దాంతో ఆ పార్టీ నేతలు లోలోపల ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి మాత్రం బహిరంగంగానే మండిపడ్డారు.
రూ.5కే భోజనంపై తెరాసను జానారెడ్డి మెచ్చుకోవడం బాధాకరమన్నారు. దానిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. త్వరలో ఆయనపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నానని చెప్పారు. క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. మజ్లిస్ పార్టీకి తమకు మిత్రపక్షమన్న కేసీఆర్ మాటలపై పాల్వాయి అసహనం వ్యక్తం చేశారు. అలా అనడం దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్ అందరిదీ: దిగ్విజయ్
అబద్దాలతో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎఎస్ రావు నగర్లో ప్రచారంలో పాల్గొన్న డిగ్గీ.. ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్లపై మండిపడ్డారు.
హైదరాబాద్ ఇక్కడి వారిది అందరిదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాలు, వర్గాల వారికి మద్దతుగా ఉంటుందని చెప్పారు. తెరాస, ఎన్డీయే పాలనలో ధరలు పెరిగాయని చెప్పారు.
రేవంత్ రెడ్డికి 'కెసిఆర్' ఆయుధం
తెలంగాణ సిఎం కెసిఆర్.. తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి చేతికి ఆయుధం ఇచ్చారు. మజ్లిస్ పైన సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యల వేర్వేరుగా ఉండటాన్ని రేవంత్ రెడ్డి, విపక్షాలు నిలదీస్తున్నాయి. శుక్రవారం రేవంత్ మాట్లాడుతూ... నిన్నటి ప్రెస్ మీట్లో తెరాసలోనే లుకలుకలు ఉన్నట్లుగా బయటపడ్డాయన్నారు. గ్రేటర్ సీట్లలో గెలుపుపై తండ్రీ, కొడుకు, కూతురు మధ్య సమన్వయం లేదన్నారు.
ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించడం లేదన్నారు. గ్రేటర్లో మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా సీట్లు సాధిస్తామని గతంలో కెటిఆర్ చెప్పారని, మరోవైపు మజ్లిస్ మిత్రపక్షమని కెసిఆర్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కెటిఆర్ రాజీనామా అంశాన్ని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మజ్లిస్ మతతత్వ పార్టీ అని కెటిఆర్ చెబితే, కెసిఆర్ దానిని సమర్థించినట్లుగా కనిపించడం లేదంటున్నారు.