రాజయ్య ఇంట్లో సారిక మృతి, నేడు ఎమ్మెస్సార్: కాంగ్రెస్ అసహనం, రెఫరెండమే: తలసాని
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మరో కొత్త తలనొప్పి వచ్చింది. ఇప్పటికే మాజీ ఎంపీ, కాంగ్రెస్ బహిష్కృత నేత రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనవళ్ల మృతి వారికి ఇక్కట్లు తెచ్చిపెట్టింది.
తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ తెలంగాణ సీఎం కెసిఆర్ పైన ప్రశంసలు కురిపించారు. రాజయ్య నివాసంలో ఆయన కోడలు, మనవళ్ల మృతి నేపథ్యంలో రాజయ్య కుటుంబం ప్రస్తుతం జైలులో ఉంది. వరంగల్ ఉప ఎన్నికల పైన ఆయన ప్రభావం పడకుండా ఉండేందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఆ ఘటన నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా బయటపడలేదు. వరంగల్ ఉప ఎన్నికల్లో రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటన ప్రభావం ఉండదని పైకి చెబుతున్నా.. లోలోన వారు మదనపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎం సత్యనారాయణ (ఎమ్మెస్సార్) కెసిఆర్ను పొగడటం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎమ్మెస్సార్ వ్యాఖ్యల పైన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య సమస్య నుంచి ఇప్పుడే కోలుకుంటుంటే మరో సమస్య తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉప ఎన్నికలు రెఫరెండమే: తలసాని
వరంగల్ ఉప ఎన్నికలు కచ్చితంగా రెఫరెండమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకమైనవన్నారు. షాదీ ముబారక్ బిసిలకు కూడా వర్తింప చేస్తామన్నారు.
రైతు ఆత్మహత్యలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. వ్యవసాయానికి వచ్చే మార్చి నుంచి 9 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పులు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.