బస్సులు తిప్పితే తీవ్రపరిణామాలు, కేసీఆర్ కనుమరుగు ఖాయం: భారత్ బంద్పై విహెచ్
అమరావతి: రేపు తలపెట్టిన భారత్ బంద్లో భాగంగా హైదరాబాదుతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం వరకు బస్సులు తిప్పితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజల ఆగ్రహాన్ని చవిచూడవలసి ఉంటుందన్నారు. సోమవారం ఏమైనా శాంతిభద్రత సమస్యలు వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు భయపడిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, వెంటనే అసదుద్దీన్ ఓవైసీతో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పించారన్నారు. పార్టీలు ఏకమైతే కేసీఆర్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై చినరాజప్ప
తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఏపీకి సంబంధం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదివారం చెప్పారు. తెలంగాణలో ఎన్నికల పొత్తు విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలే నిర్ణయించుకుంటారని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలంగాణ టీడీపీ నేతలు స్థానిక పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణలో పొత్తు విషయంపై తాము ఇక్కడ ఏమీ మాట్లాడలేమన్నారు.
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏపీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబుపై 24 కేసులు పెట్టినా ఒక్కటీ నిలబడలేదని చెప్పారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని, అందువల్లే అధికార పార్టీలో ఉంటూనే పోలీసు వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు.