కేసీఆర్ను ఆపేదెలా?: సోనియా వద్ద వీహెచ్, పాల్వాయి మంతనాలు..!
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆకర్షిస్తూ, టీఆర్ఎస్లో చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను నిలువరించడమెలా? అన్న విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు చర్చించినట్టుగా తెలుస్తోంది.
సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పాల్వాయిలు అధినేత్రి సోనియా గాంధీని కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాజా రాజకీయ పరిణామాలను ఆమెకు వివరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' పై పూర్తి వివరాలను ఆమెకు వెల్లడించారు.
రాష్ట్రంలో ఫిరాయింపులను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోనియాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సోనియా గాంధీకి వివరించాలమన్నారు. రాష్ట్రంలో పార్టీ పునర్మినానికి క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నాయకులు గ్రూపులు పెట్టి కాంగ్రెస్ను చీల్చడం సరికాదన్నారు.
కలసిమెలసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని పాల్వాయి ఆరోపించారు.
మరోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన నేతలపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.