సంచలనం, భర్తకు ఝలక్!: బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత దామోదర భార్య పద్మిని, కారణాలివేనా?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర కోణం. దాదాపు ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమైక్యాంధ్ర ప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. దాదాపు ఇది ఎవరూ ఊహించని పరిణామం.
ఆమె బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదు. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో ఓ కీలక నేత అయిన దామోదర సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదు. అలాగే, ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. భర్త దామోదర ఓ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ఉండగా భార్య పద్మిని మరో జాతీయ పార్టీ బీజేపీలో చేరారు.
పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంపై మురళీధర రావు
పద్మినీ రెడ్డి భర్త దామోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. పద్మినీ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత మురళీధర రావుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమె బీజేపీలో చేరిన అనంతరం మురళీధర రావు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల పద్మినీ రెడ్డి నమ్మకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
పార్టీ మారడం వెనుక?
పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె ఎందుకు పార్టీ మారారనే అంశంపై వివిధ రకాలుగా చర్చ సాగుతోంది. ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. పార్టీ ఇవ్వలేకపోవడంతో ఆమె పార్టీ మారారా అనే చర్చ సాగుతోంది. తాను కోరుకున్న సీటు రాకపోవడంతోనే పార్టీ మారి ఉంటారని భావిస్తున్నారు. అలాగే భర్తకు తెలియకుండా జరిగి ఉండదని, ఇటీవల తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీకి కావాల్సిన సీట్లు రాకుంటే, బీజేపీ అవసరం పడితే దామోదరకు పొత్తులో భాగంగా దామోదరకు ముఖ్యపదవి కట్టబెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ కూడా సాగుతోంది.
ఈ కారణాలు కూడా ఉన్నాయా
ఆమె సంగారెడ్డి టిక్కెట్ కూడా ఆశించారని తెలుస్తోంది. దానిని జగ్గారెడ్డికి ఇచ్చారు. అదే సమయంలో మహాకూటమి, పార్టీలో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో పద్మినీరెడ్డికి టిక్కెట్ రాలేదని చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ఒకే సీటు అనే నిబంధన కూడా కాంగ్రెస్ పార్టీలోకి తాజాగా వచ్చింది. ఈ అన్నింటి పరిమామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి ఉంటారని భావిస్తున్నారు. ఆమె పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పద్మినీ రెడ్డి గత కొంతకాలంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇది కీలక పరిణామమే
తెలంగాణ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలోనైనా కూర్చోవాలని నేతలకు సూచించారు. అదే సమయంలో పట్టున్న నేతలను తీసుకోవడం, తాను చేసిన సూచనలు పాటిస్తే బీజేపీ బలోపేతం అవుతుందని తెలిపారు. ఇప్పటికే బాబు మోహన్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్లో టిక్కెట్లు రాని వారు మరికొందరు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.