అసెంబ్లీలో గందరగోళం: ఔట్ సోర్సింగ్ అంశంపై కీలక చర్చ, కాంగ్రెస్ నినాదాలు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలపై చర్చను వెంటనే చేపట్టాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలపై చర్చను వెంటనే చేపట్టాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Recommended Video
కాగా, కాంగ్రెస్ నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. అయినా సభ్యులు ఆందోళనను కొనసాగించారు. శాసనమండలిలోనూ కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలు చేస్తున్నారు.
కృషి చేస్తాం: సీఎం కేసీఆర్
మరిన్ని దేవాలయాలను గుర్తించి అర్చకులకు వేతనాలు ఇవ్వాలని కోరిన సభ్యులు కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్లకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మిగితా దేవాలయాల్లోని అర్చకులందరికీ గౌరవ వేతనం ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. హోంగార్డుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.
మండలి నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ సభ్యులు
కాగా, శాసనమండలిలో ఆందోళన చేస్తూ నినాదాలు చేసిన కాంగ్రెస్ సభ్యులు కొద్ది సేపటికి మండలి నుంచి వెళ్లిపోయారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన చేయవద్దని కోరినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలితపై పోలీసుల తీరును చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ సభ్యులు.
కాగా, కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న ఆందోళనను వెంటనే విరమించుకోవాలని అక్బరుద్దీన్ కోరారు. సీఎం మాట్లాడుతున్నా వినకుండా ఆందోళన చేయడం బాధాకరమన్నారు. ఆందోళన చేసే హక్కు ఉంది కానీ,.. ఇది పద్ధతి కాదని అన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై చర్చ: కేసీఆర్ హామీ
విద్యుత్ శాఖలో 22వేలమంది ఉద్యోగులను పర్మినెంట్ చేసిన కేసీఆర్.. ఇతర శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కోరారు. చాలా కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కాకుండానే రిటైరవుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చట్టం చేసి న్యాయపరమైన అవరోధాలు తొలగిపోతాయని అన్నారు. ఈ సమస్యను మానవీయ కోణంలో చూడాలన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు అక్బురుద్దీన్ తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం సరైందే కానీ, మళ్లీ కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొవద్దని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు.
గత ప్రభుత్వాల వల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సృష్టి జరిగిందని సీఎం అన్నారు. ఇక తాము ఆ విధానాన్ని కొనసాగించమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నా మూడు నెలలకు మాత్రమే ఉంటుందని చెప్పారు. రిజర్వేషన్ల వారు నష్టపోతున్నారని అక్బురుద్దీన్ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని కూడా ఉద్యోగాలు కల్పించడం లేదని బద్నాం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఏ ప్రభుత్వానికి కూడా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది.