కాంగ్రెస్ సభ్యత్వ నమోదు.!డిజిటల్ పద్ధతిలో తెలంగాణ నుంచే ప్రారంభం.!రేవంత్ పై పెద్దఎత్తున అంచనాలు.!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవిలో చోటు చేసుకున్న మార్పు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంకేతమని నాయకులు అభిప్రాయపడుతున్నారు. నిరాశా నిస్పృహలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఊపిరి పోసాడని, కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుందని కార్యక్తలు భావిస్తున్నారు. నాయకుల, కార్యకర్తల అంచాలకు తగ్గట్టు పార్టీని బలోపేతం చేసి అధికారం వైపు తీసుకెళ్లాల్సిన బాద్యత కూడా రేవంత్ రెడ్డిపై ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీని క్షేత్ర స్తాయిలో బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజును వేదికగా మలుచుకోనున్నారు రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సీసిసి ఛీఫ్.
సోనియా పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం..పెద్దఎత్తున యువతకు చేరువయ్యేలా ప్రణాళిక
తెలంగాణలో నూతనోత్సాహంతో దూసుకుపోతున్న కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు సభ్యత్వ నమోదుకు సిద్ధమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రూపొందించన నూతన సభ్యత్వ నమోదు విధానాన్ని తెలంగాణ నుంచి ప్రారంభించనుంది. బూత్ స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న ఈ కార్యక్రమం చేపట్టనుంది. కొడంగల్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు తమ స్వస్థలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు.
రేవంత్ మేనియా.. పెద్దఎత్తున అంచనాలు పెట్టుకున్న అధిష్టానం
గతంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, మ్యాన్యువల్ గా జరిగేది. కానీ ఈ సారి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరు అడిగినా పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చేవారు. వాటిని చాలా మంది నిర్ధిష్టమైన అమౌంట్ చెల్లించి, సభ్యత్వం తీసుకునేవారు. వీరందరినీ ఆర్గనైజ్ చేసే వ్యవస్థ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సభ్యత్వం తీసుకునే వాళ్లందరి వివరాల్ని నమోదు చేస్తారు. అందరి వివరాలు ఏఐసీసీ, టీపీసీసీకి అనుసంధానమై ఉంటాయి. సభ్యత్వ నమోదు కోసం ప్రతీ బూత్ కు ఓ ఎన్ రోలర్ ను నియమించారు. ఈ ఎన్ రోలర్ ఆధ్వర్యంలోనే మొత్తం ప్రక్రియ జరగనుంది. గతంలో సభ్యత్వ నమోదులో పారదర్శకత ఉండేది కాదు. కానీ వివరాలు ఆధారంగా ఇప్పుడు వెరిఫైడ్ మెంబర్ షిప్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఢిల్లీకి అనుసంధానం.. అంతా ఆన్ లైన్ లోనే
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునే వాళ్ల వివరాలన్నీ, ఏఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పొందుపరుస్తారు. పార్టీ సభ్యుల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు అందులో ఉంటాయి. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపనిచ్చే కార్యక్రమాల వివరాలు యాప్ ద్వారా పార్టీ సభ్యులకు నేరుగా అందుతాయి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం, పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో ప్రారంభం కానుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికే బూత్ ఎన్ రోలర్లను నియమించారు. వీళ్ల ఆధ్వర్యంలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తం జరుగుతుంది. సభ్యత్వం తీసుకోవాలని అనుకునే వాళ్లు కేవలం తమ వివరాలు అందిస్తే సరిపోతుంది.
Recommended Video
ఈ సారి అదే ప్రత్యేకత. పారదర్శకతకు ప్రాముఖ్యత
ప్రతీ పార్టీ కూడా తమకు ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నారని ప్రకటించడం చూస్తున్నాం. కానీ ఈ సభ్యత్వ నమోదులో పారదర్శకత అసలు ప్రశ్న. నిజంగా అంత మంది సభ్యులు మెంబర్ షిప్ తీసుకున్నారో లేదో తెలియదు. కానీ, దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ప్రకారం, కచ్చితమైన లెక్క ఉంటుంది. బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు, విధానాలు తీసుకెళ్లి... ప్రజల్ని కాంగ్రెస్ వెంట నడిపించేందుకు ఎన్ రోలర్లు, సభ్యులు క్రియాశీలకంగా నిలవనున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, మన రాష్ట్రం నుంచి ప్రతిష్ఠాత్మక డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రారంభించడం విశేషం.