పూర్తయిన కాంగ్రెస్ విలీన ప్రక్రియ...! నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ...
గత కొంతకాలం నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ వీలీన ప్రక్రియ పూర్తయింది. విలీనానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చకచక పావులు కదిపింది. ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి స్పికర్కు లేఖ ఇచ్చిన కొద్ది గంటల్లోనే సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహచార్యులు గెజిట్ నోటిఫికేషన్ కూడ విడుదల చేశాడు. దీంతో తాజాగా అసెంబ్లీలో పార్టీల బలాబలాలు అధికారికంగా మారాయి. టీఆర్ఎస్ బలం సెంచరీ దాటగా కాంగ్రెస్ బలం 6కు చేరింది. మరోవైపు ఎంఐఎం రెండవ అతిపెద్ద పార్టీగా మారింది.
మధ్యహ్నాం స్పికర్కు లేఖ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కాగా గురువారం మధ్యహ్నం టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నేండు మంది తామంతా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచామని అయితే షెడ్యుల్ పది ప్రకారం మూడింట రెండు వంతుల మంది టీఆర్ఎస్లో విలీనం అవుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి అధికారిక లేఖ ఇచ్చారు. అనంతరం నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిర్తో భేటి అయ్యారు.
ఏడు గంటల్లో విలీన ప్రక్రియ పూర్తి..
ఇక మధ్యహ్నాం నుండి స్పికర్ సైతం చకచక పావులు కదిపారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన కొనసాగిస్తుంటే మరోవైపు వారికి అందుబాటులోకి వెళ్లకుండా విలీన ప్రక్రియను కొనసాగించారు. లేఖ ఇచ్చిన ఏడు గంటల్లోనే విలీన ప్రక్రియను ముగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నేండు మంది సభ్యులు అధికారికంగా టీఆర్ఎస్లో కొనసాగనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో...
ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ,పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కొత్తగూడేం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నల్గోండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,మహెశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్ , కోల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డీ, తాజాగా మాజీ మంత్రి మహెందర్ రెడ్డిపై గెలిచిన తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు ఉన్నారు.