నెల రోజుల్లో ఐదుగురు ఔట్: దేనికైనా రెడీ.. హరిప్రియ, సబిత నో... జానా సహా అందరూ ఆశ్చర్యం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు అయింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి కనీసం నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే కాంగ్రెస్ నుంచి ముగ్గురు, నలుగురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే తెరాసలో చేరారు. సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు వరుసలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, రేగా కాంతారావుల అనంతరం హరిప్రియ నాయకు కూడా తెరాసలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అందుకే పవన్ కళ్యాణ్కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?
సబితా ఇంద్రారెడ్డి చర్చలు ఫలప్రదం
సబితా ఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ తెరాసలో చేరికకు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా, తన తనయుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఆదివారం మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలతో చర్చలు జరిపారు. తెరాసతో సబిత చర్చలు సఫలమయ్యాయని చెబుతున్నారు. నేడో రేపో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా తాను తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. అవసరమైతే తాను రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున మళ్ళీ పోటీ చేస్తానని చెప్పారు.
కేసీఆర్పై హరిప్రియ ప్రశంసలు
హరిప్రియ తెరాసలోకి వెళ్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా, ఆమె లేఖను విడుదల చేశారు. ఆమె కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ బాటలో పయనించడం శ్రేయస్కరమని భావించానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజల రుణం తీర్చుకోవాలన్నా, వారికి అభివృద్ధి ఫలాలు అందించాలన్నా తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాస బి ఫాంపై పోటీ చేస్తానన్నారు.
ఆశ్చర్యపోయిన సీనియర్లు.. నో చెప్పిన సబిత
మరోవైపు, పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా తెరాసలోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్లు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోవడం లేదు. కేటీఆర్తో సబిత భేటీ విషయం తెలిసి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్కమార్క, సుధీర్ రెడ్డి వంటి నేతలు ఆశ్చర్యపోయారట. వీరంతా కలిసి సబిత ఇంటికి వెళ్లి చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీలోనే కొనసాగాలని సీనియర్లు నచ్చచెప్పినప్పటికీ ఆమె నో చెప్పారని తెలుస్తోంది. తమ ప్రమేయం లేకుండా నేతనలు చేర్చుకోవడం, కొండా విశ్వేశ్వర్ రెడ్డని పార్టీలోకి తీసుకొని, చేవెళ్ల లోకసభ నుంచి పోటీ చేయిస్తామని చెప్పడం, కార్తీక్ రెడ్డికి టిక్కెట్ నిరాకరించడం వంటి అంశాలను ఆమె వారి దృష్టికి తీసుకువెళ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.