"కేసీఆర్ మాట తప్పారు.. ఆ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తా!"
ఆ పత్రికలో వచ్చిన వ్యాసం గనుక తాను రాసిందేనని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని చిన్నారెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తాను ఏనాడు సమర్థించలేదని, ఈ ప్రాజెక్టును సమర్థిస్తూ ఓ దినపత్రికలో తన పేరిట వచ్చిన వ్యాసం తాను రాసింది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.
ఆ పత్రికలో వచ్చిన వ్యాసం గనుక తాను రాసిందేనని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పదే పదే తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న చిన్నారెడ్డి.. పుష్కర ఘాట్ల నిర్మాణంలో ఆయన నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని, 'పాలమూరు', 'రంగారెడ్డి' ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని 27వేల నుంచి 50వేల కోట్లకు ఇష్టానుసారంగా పెంచేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే దళితున్ని సీఎం చేస్తానన్న సీఎం కేసీఆర్ గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ నెరవేర్చకపోతే తల నరుక్కుంటానని కేసీఆర్ అప్పట్లో చెప్పిన మాటను గుర్తు చేశారు. అధికారం రాగానే కేసీఆర్ మాట తప్పారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.'