చేసిందేమీ లేదు: డిఎస్పై భగ్గుమన్న ఆకుల లలిత
నిజామాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్పై కాంగ్రెసు ఎమ్మెల్సీ ఆకుల లలిత భగ్గుమన్నారు. డి. శ్రీనివాస్ తమకు చేసిందేమీ లేదని ఆమె అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పిసిసి అధ్యక్షుడు ఇప్పించారని ఆమె చెప్పారు.
బలహీనవర్గాలకు న్యాయం చేశామని అంటున్న డి. శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎంత మందిని పైకి తెచ్చారో చెప్పాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా డిఎస్ చేసారని, తాను డిఎస్ శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని ఆమె చెప్పారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేశారనే అభిప్రాయంపై ఆమె ఆ విధంగా అన్నారు.
తనను సంప్రదించకుండానే ఆకుల లలిత పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేశారని డిఎస్ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేస్తారని డిఎస్ ఆశించారు. అయితే, ఆయనను కాదని కాంగ్రెసు నాయకత్వం ఎమ్మెల్సీ పదవికి ఆకుల లలిత పేరను ఖరారు చేసింది.