ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం.. కార్మికులకు అన్యాయం : జీవన్ రెడ్డి
హైదరాబాద్ : ఆర్టీసీ నష్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కార్మికులకు అన్యాయం చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రభుత్వ తప్పిదాలే కారణంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఏమేర చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై సీఎం కేసీఆర్ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. సమస్యలుంటే నిధులు లేవని వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. కొత్త సచివాలయం నిర్మాణం అవసరం లేదని.. దాన్ని ఆపేసి ఆ డబ్బులతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు. 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
గల్ఫ్ లాటరీలో జాక్పాట్.. అకౌంటెంట్కు 23 కోట్లు.. హ్యాపీగా ఉందంటూ..!
వేతన సవరణ కాల పరిమితి ముగిసి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు అమలు చేయకపోవడం వెనుక కారణమేంటని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్లో మీరు దసరా పండుగ చేసుకుంటే.. ఆర్టీసీ కార్మికులు మాత్రం పండుగ జరుపుకోవద్దా అని ప్రశ్నించారు. సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనేది కార్మికుల అభిమతం కాదని.. తప్పని పరిస్థితుల్లో మాత్రమే కడుపు మండి డిమాండ్ల సాధన కోసం రోడ్డెకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన విషయం కేసీఆర్ విస్మరిస్తున్నారని ఫైరయ్యారు.