ఏపీని చూడండి.. జగన్ను చూసి నేర్చుకోండి.. కేసీఆర్పై జీవన్ రెడ్డి సెటైర్లు
జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పొరుగు రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరును చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పన, పింఛన్ల వంటి అంశాల్లో కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
సోమవారం నాడు జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక పింఛన్ల విషయంలోనూ డ్రామా ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ పాత లబ్ధిదారులకు పింఛన్లు పెంచి.. కొత్త లబ్దిదారులను మాత్రం మరిచిపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఇక రుణమాఫీపై కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు.
కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అక్కడి ఉద్యోగులకు 27 శాతం పీఆర్సీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగులపై కక్ష సాధింపు ధోరణిలో అవినీతిపరులుగా ముద్రవేసి వేధిస్తున్నారని మండిపడ్డారు.
సీపీఎస్ రద్దు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకున్నా.. ఏదో మునిగిపోయినట్లుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. పోయిన ఐదేళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని ఫైరయ్యారు. ఎన్నికల వేళ హామీల మీద హామీలు గుప్పించిన కేసీఆర్ నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయకుండా వారితో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.