కేసీఆర్ను అరెస్ట్ చేయండి.. ఎవరైనా ఆపుతున్నారా.. జీవన్ రెడ్డి సెటైర్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కనీస మద్దతు ధర ప్రభుత్వ బాధ్యత కాదు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ను జైల్లో పెడతామంటే బీజేపీని ఎవరు ఆపుతున్నారని నిలదీశారు. ఆ రెండు పార్టీలు లోపభూయిష్టంగా కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేశారు.
రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై సన్న బియ్యం పండించాలని రైతులను ఆదేశించడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. ఢిల్లీలో పొర్లు దండాలు పెట్టిన కేసీఆర్కు ధాన్య సేకరణ బాధ్యత లేదా అని నిలదీశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయట్లేదని అడిగారు. ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వం అధికారంలో ఉండే నైతికత కోల్పోయిందని జీవన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను జీవన్ రెడ్డి ఎండగడుతూ వస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమం మరచిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా బయటకు వస్తుందని చెప్పారు. దుబ్బాక బై పోల్, గ్రేటర్ ఎన్నికలతో రుజువు అవుతుందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. వరంగల్ ఇతర నగరాల కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నందునే సీఎం కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించారని తెలిపారు.