సీఎంను కాల్చిచంపినా తప్పులేదు.. కూతురి బండారమూ బయటపెడతా.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో దారుణాలు
అభివృద్ధి పేరుతో తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి లాక్కొచ్చి పంజాగుట్ట చౌరస్తాలో మెట్రో పిల్లర్కు కట్టేసి కొట్టినా తప్పులేదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోమవారం మరోసారి అధికార పార్టీపై ఆయన అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నదని వాపోయారు.
చిచ్చురేపిన చైర్మన్ ఎన్నిక
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. క్లియర్ మెజార్టీ ఉన్న చోట ఎన్నికలు ప్రశాంతంగానే జరిగినా.. పోటీపోటీ పోరు జరిగిన మున్సిపాలిటీల్లో మాత్రం చైర్మన్ ఎన్నిక రసాభసగా మారింది. ఇద్దు కాంగ్రెస్ ఎంపీలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోనైతే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న యాదాద్రి మున్సిపాటిలీ చైర్మన్ ఎన్నికపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తగువులాడుకున్నాడు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి.. సీఎం కుటుంబాన్ని ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంపినా తప్పులేదు..
‘‘మున్నిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దారుణాలకు తెగబడుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లిద్దరినీ కాల్చి చంపినా తప్పులేదు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కూతురు కవిత యాదాద్రిలో భూదందాలు చేస్తోంది. తుర్కపల్లిలో ఆమె అక్రమంగా 500 ఎకరాలు కాజేసింది. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మాదగ్గరున్నాయి. అందరి బండారం బయటపెడతాం'' అని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.
యాదాద్రికి కేంద్ర నిధులు తెస్తా..
యాదగిరి గుట్టలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారని, ఎక్కడో వరంగల్ కు చెందిన కడియం శ్రీహరితో ఎక్స్ అఫీషియో ఓటు వేయించి మున్సిపల్ చైర్మన్ పదవిని అక్రమంగా లాగేసుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని కోమటిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కు మెజార్టీ ఇచ్చిన యాదాద్రి మున్సిపాలిటీ ప్రజలకు ధన్యవాదలు చెబుతానని, సీఎం హోదాలో 12 సార్లు వచ్చినా యాదాద్రికి కేసీఆర్ చేసిందేమీలేదని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవెలప్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అటు నల్గొండ మున్సిపాలిటీలోనూ బీజేపీ, ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు.
భార్యను మోసం చేసిన సీఐ..
యాదగిరి గుట్టలో స్వతంత్ర అభ్యర్థిని కారులో కిడ్నాప్ చేయబోయిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా, సదరు స్వతంత్ర అభ్యర్థిని.. పోలీస్ సీఐ పాండురంగారావు దగ్గరుండిమరీ టీఆర్ఎస్ క్యాంపుకు తరలించారని ఎంపీ తెలిపారు. సీఐ పాండురంగారావు పెద్ద అవినీతిపరుడని, కట్టుకున్న భార్యను దారుణంగా మోసం చేశాడని, 10లక్షలు లంచమిచ్చి యాదగిరిగుట్టలో పోస్టింగ్ తెచ్చుకున్నాడని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.