పంజాగుట్ట చౌరాస్తాలో మెట్రో పిల్లర్కు కట్టేసి చితకబాదుడు.. అయినా సరిపోదంటూ ఘాటు విమర్శలు..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా తమకు కేటాయించిన పట్టణాల్లో బిజీబిజీగా చక్కర్లు కొడుతున్నారు. అదే సమయంలో పక్క పార్టీలపై విమర్శల జోరునూ పెంచారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కొదరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా వెనుకాడటం లేదు.
అంతా మోసం..
మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోయేది టీఆర్ఎస్ పార్టీనే అని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా కరువయ్యారన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేక్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ఆయన అధికార పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు.
కట్టేసి కొట్టినా పాపం లేదు..
‘‘అభివృద్ధి పేరుతో తెలంగాణను టీఆర్ఎస్ ఆగం చేసింది. ఇప్పటికీ పేదవాళ్లకు ఇళ్లు లేవు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకనట రాలేదు. ఇటీవల 28 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారకురాలు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయం అంతాఇంతాకాదు. వాళ్లిద్దరినీ ప్రగతి భవన్ నుంచి తీసుకొచ్చి పంజాగుట్ట చౌరస్తాలో మెట్రో పిల్లర్ కు కట్టేసి కొట్టినా పాపం లేదు''అని కోమటిరెడ్డి అన్నారు.
కాబట్టే తెలంగాణ ఇవ్వగలిగాం..
టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలే బాస్ అని, కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీ హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటారని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకూ ఎంపీ కోమటిరెడ్డి బదులిచ్చారు. కేంద్రంలో బాస్ లు ఉండబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, పోరాడి సాధించుకున్న తెలంగాణను టీఆర్ఎస్ పాడుచేస్తోందని మండిపడ్డారు.