కేటీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ... ఢిల్లీలో ఫైట్ చేద్దాం,సిద్దమా... సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులే..
తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమా అని సవాల్ విసిరారు. సోమవారం(మార్చి 8) నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో... నిరవధిక దీక్షతో ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుదాం వస్తారా అని ప్రశ్నించారు.
సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులే.. : రేవంత్ రెడ్డి
ఐటీఐఆర్తో పాటు రాష్ట్ర విభజన హామీలు,సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాను సాధించుకునేందుకు సిద్ధమైతే కేటీఆర్ తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఈ సవాల్కు కేటీఆర్ సూటిగా సమాధానమివ్వాలని... అంతే తప్ప దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా,తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ ఆత్మ ఒకటేనని.. శరీరాలే వేరని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికలప్పుడేనా బీజేపీపై యుద్దం : రేవంత్
టీఆర్ఎస్-బీజేపీ రాజకీయాలు ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ అన్నట్లుగా ఉంటుందని రేవంత్ విమర్శించారు. ఏడేళ్లుగా ఇదే జరుగుతోందని అన్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారని... కానీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి మోదీతో రాజీ పడ్డారని అన్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మళ్లీ బీజేపీపై యుద్ధం అంటున్నారని.. ఉత్తర కుమారుడిలా కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే తన సవాల్ను స్వీకరించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో రేవంత్
ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరుపున ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి,వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా తన సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బహిరంగ లేఖలు,సవాల్లతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ,దుబ్బాకల్లో టీఆర్ఎస్కు పరాభవం ఎదురవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎటువంటి తీర్పు చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.