‘పెన్ను మీద మన్ను గప్పితే గన్నులై పేలుతయ్’: హరీశ్ ఎక్కడంటూ రేవంత్ నిప్పులు
హైదరాబాద్: సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండ్రోజులు డిపోకు రాలేదని ఆర్టీసీ ఉద్యోగులను తీసేస్తే.. మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా? అని ప్రశ్నించారు.
ఆదివారం హైదరాబాద్లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితోపాటు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
శ్రీనివాస్ రెడ్డి బలహీనుడు కాదు..
ఖమ్మంలో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్థికంగా బలహీనుడు కాదని, ఉద్యోగ భద్రత గురించిన ఆందోళనే ఆత్మహత్యకు కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ముందుకు రావడానికి ముఖంచెల్లక ముఖ్యమంత్రి ప్రెస్నోట్లు రిలీజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హరీశ్ రావు ఎక్కడ?
సమ్మె చట్టబద్ధంగా జరుగుతుంటే ఆట మధ్యలో గేమ్ రూలు మారుస్తామంటే కుదరదని కేసీఆర్ సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పుడు ఆర్టీసీ సమ్మెను విఫలం చేస్తే భవిష్యత్తులో టీచర్లను కూడా పాలెగాళ్లుగా చూసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
గన్నులై పేలుతాయ్..
తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. చుక్కా రామయ్య, కోదండరాం, వరవరరావు లాంటి వాళ్లను కేసీఆర్ సర్కారు అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. పెన్ను మీద మన్ను కప్పితే గన్నులై పేలుతాయంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
పార్టీలవైపు చూడొద్దు..
ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలవైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులకు రేవంత్ సూచించారు. అక్టోబర్ 19న తలపెట్టిన తెలంగాణ బంద్కు తెలంగాణలోని అన్ని వర్గాలు, సంఘాలు, ప్రజలు సహకరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.