‘‘కాంగ్రెస్ నెం.1 విలన్, జైరాం రమేష్వి చిల్లర ఆరోపణలు, మరో కేసీఆర్ ను చూస్తారు..’’
కేటీఆర్పై జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలను నిరూపిస్తావా? అబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాస్తావా? అని సీఎం ప్రశ్నించారు. జైరాం రమేష్వి చిల్లర వ్యాఖ్యలని కేస
హైదరాబాద్: కేటీఆర్పై జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలను నిరూపిస్తావా? అబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాస్తావా? అని సీఎం ప్రశ్నించారు. జైరాం రమేష్వి చిల్లర వ్యాఖ్యలని కేసీఆర్ అన్నారు. జైరాం రమేష్ సర్పంచ్గా కూడా గెలవలేడని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు వస్తుంటే కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని, ఈ కారణంగానే ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటి వరకు 119 కేసులు వేశారని చెప్పారు.
ఇదేనా ప్రతిపక్షం వ్యవహరించాల్సిన తీరు?
బుధవారం మీడియాతో మాట్లాడిన సీఎం.. భూ నిర్వాసితులకు పరిహారంపై మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. వారి పాలనా కాలంలో కట్టిన ప్రాజెక్టులకు రూ.6 లక్షల పరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలే కొండపోచమ్మ ప్రాజెక్టును ఆపుతున్నారని, వారిని ప్రజలు నిలదీయాలని అన్నారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ స్టేషన్లపైనా కేసులు వేశారని, కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహరించే తీరు ఇదేనా? అని నిలదీశారు. దుర్మార్గ క్షుద్ర రాజకీయాలను ఎంత కాలం చేస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఈ దుస్థితికి కాంగ్రెస్ నెం.1 విలన్ అని వ్యాఖ్యానించారు.
Recommended Video
ఇసుక ద్వారా మూడేళ్లో రూ.1000 కోట్లు తెచ్చాం..
ఇసుకపై మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని సీఎం మండిపడ్డారు. మూడేళ్లలో ఇసుక ద్వారా 1000 కోట్ల ఆదాయం తెచ్చామన్న సీఎం.. కాంగ్రెస్ హయాంలో రూ.50 కోట్ల ఆదాయం కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మూడేళ్లుగా సొల్లు పురాణం చెబుతున్నారని మండిపడ్డారు. వారి చేతగానితనం వల్ల మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. సచివాలయం కడుతామంటే స్టేలు తీసుకొస్తారు.. కాంగ్రెస్ నేతల తీరు.. మేం చేయలేదు.. మీరు కూడా చేయొద్దన్నట్టుంది అని వ్యాఖ్యానించారు.
సీఎంను కదాని ఊరుకున్నా... లేకుంటే...
ఎన్ని వెకిలి ప్రయత్నాలు చేసినా...ఆరు నూరైనా తెలంగాణను అభ్యుదయ పథంలో నడుపుతామని సీఎం స్పష్టం చేశారు. కోర్టులు చివాట్లు పెట్టినా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెళ్లడమే ఆలస్యం.. కేసులు వేస్తున్నారని, చివరకు అమరవీరుల స్మారకం మీద కూడా కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. ఇంత అసహన వైఖరి ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిని కదా అని గంభీరంగా ఉన్నానన్న సీఎం.. ఇక నిజమైన కేసీఆర్ను చూస్తారని హెచ్చరించారు.
ఇది అబ్సార్ప్షన్... రెగ్యులరైజేషన్ కాదు
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్నబుచ్చుకోవద్దని.. కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసినా.. ఉద్యోగులు ఏం బాధ పడొద్దని.. కోర్టు చెప్పిన దానికంటే ఇంక ఎక్కువే ఇవ్వడానికి తమ ప్రభుత్వం రెడీ గా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. నిబంధనలకు లోబడే హైకోర్టు తీర్పు ఇచ్చిందని... రెగ్యులరైజేషన్ కరెక్ట్ కాదని ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో కష్టాలుపడుతున్నరని...విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్టర్లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని సీఎం తెలియజేశారు. కాంట్రాక్టర్ల దోపిడి నుంచి విద్యుత్ ఉద్యోగులకు కాపాడటానికే వాళ్లను డిపార్ట్ మెంట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం తప్ప వాళ్లను రెగ్యులరైజ్ చేస్తూ కాదని ఆయన స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది అబ్సార్ప్షన్ కాని క్రమబద్దీకరణ కాదన్నారు.
వీళ్లకు చేతకాక.. బాహుబలిని తెచ్చుకుంటారట
రాష్ట్రంలో కురుస నాయకత్వం మోపైందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల్లో గర్వించదగ్గ నేతలు లేరని, విపక్ష పార్టీలు సిద్దాంతాలు, సిగ్గు వదిలేశాయని నిప్పులు చెరిగారు. వేరెవరో కాదు.. ప్రతిపక్షంలో దమ్మున్న వారు లేరనే విషయాన్ని కాంగ్రేస్ నేతలే స్వయంగా ప్రకటించారని అన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి ఎక్కడి నుంచో బాహుబలి వస్తాడు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. ఈ వ్యాఖ్యలతో తమకు చేతకాదని వారికి వారే డిక్లేర్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న దిక్కుమాలిన ఆరోపణలు చూస్తూ చాలా ఓపికపట్టానన్న సీఎం.. అర్థంపర్థం లేని నిరాధార ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. ఇది సరైన పద్దతి కాదని హితవు చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అంటే ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలన్నారు.