'మహా' దగా: కెసిఆర్పై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై కాంగ్రెసు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. కెసిఆర్ చేసుకున్న ఒప్పందంలో కొత్తదనమేమీ లేదని వారన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో కెసిఆర్పై దుమ్మెత్తి పోశారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కుదిరిన ఒప్పందమే ఇది అని వారు చెప్పారు. అయితే తుమ్మడిహట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టాలని గత ఒప్పందం కాగా, కెసిఆర్ ఒప్పందంలో ఆ ఎత్తును 4 మీటర్లు తగ్గించడంతో తెలంగాణ అన్యాయం జరిగిందని వారన్నారు.
కెసిఆర్ కుదుర్చుకున్న ఒప్పందం, మహా మోసమని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణను ముంచే ఒప్పందమని వారు మండిపడ్డారు. ఒక ఎకరం ఆయకట్టు పెరగకుండా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రం రూ. 50 వేల కోట్లు పెంచారని, అందుకే ఇది దేశంలోని అతి పెద్ద కుంభకోణమని వారు ఆరోపించారు.
ఇది తెలంగాణ రాష్ట్రానికి చీకటి రోజు అని, మహారాష్ట్రకు మేలు జరిగే విధంగా, తెలంగాణకు నష్టం జరిగే విధంగా ఒప్పందం కుదిరిందని వారన్నారు.
కెసిఆర్ అనాలోచిత విధానానికి, అహంకారానికి మహారాష్ట్ర ఒప్పందం నిదర్శమని కాంగ్రెసు నేత జీవన్ రెడ్డి కరీంనగర్లో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజానాలను కెసిఆర్ తాకట్టు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రతో కుదిరిన తాజా ఒప్పందంతో ఆర్థిక భారం పడుతుందని, దానికి తోడు నీటి హక్కులను కోల్పోతామని ఆయన అన్నారు.
ఏకపక్షంగా మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంలోని మతలబు ఏమిటని ఆయన అడిగారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే 1800 ఎకరాలు ముంపునకు గురవుతాయని అప్పట్లో అభ్యంతరం తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడెలా అంగీకరించారని ఆయన ప్రశ్నించారు.
అయితే 2012లోనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహన్తో జరిగిన ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, విద్యార్థులు మహా ఒప్పందంపై మేల్కోవాలని ఆయన సూచించారు.
మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం, ప్రాజెక్టుల రీడీజైనింగ్లపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేసి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన విమర్శించారు.
మహారాష్ట్ర బిజెపి, తెలంగాణ టిఆర్ఎస్ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి స్వార్థరాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు.