కెసిఆర్ 500 రోజుల పాలనపై 50 ప్రశ్నలతో పుస్తకం, జవాబివ్వండి: అలీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 18 నెలల పాలన పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు ఓ పుస్తకం విడుదల చేశారు. కెసిఆర్ 500 రోజులకు పైగా పాలన పైన తాము 50 ప్రశ్నలు ప్రశ్నించామని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు.
కేసీఆర్ పాలనపై పుస్తకంలో 50ప్రశ్నలు సంధించినట్లు చెప్పారు. పుస్తకాన్ని వరంగల్ ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. హామీలు మరిచిన కెసిఆర్కు వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఫాస్ట్ పథకం స్లో అయిందని, డబుల్ బెడ్ రూం ఇళ్ల ఊసే లేదన్నారు. 500 రోజుల పాలనపై తమ 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
తాము సంధించిన 50 ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే కాలం దగ్గర పడిందన్నారు. పోలవరం పైన కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని పొంగులేటి నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి ఎలా అవుతుందన్నారు.
కెసిఆర్ తాను ఇచ్చిన హామీలలో కనీసం పది శాతం కూడా అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. తాము విడుదల చేసిన బుక్లెట్లోని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. బహిరంగ చర్చకు రావాలన్నారు.