తెలంగాణలో సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు: ఇలా అయితే కట్
హైదరాబాద్: 2019 ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు నిర్వహిస్తోంది. సర్వేల ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ముందస్తుగా ఎన్నికలు జరిగినా ఆ మేరకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకొంటుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో బలబలాలను బేరీజు వేసేందుకు సర్వేలను ప్రాతిపదికగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది., సర్వేలో అగ్రస్థానంలో నిలిచినవారికే టిక్కెట్లు లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రాకపోయామనే బాధ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే తెలంగాణలో ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.
ముందస్తుగానే 2019లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ముందస్తుగా ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సిద్దంగా ఉండాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది. అయితే సర్వే ఆధారంగానే టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
సర్వే ఆధారంగానే టిక్కెట్లు
2019 ఎన్నికల్లో సర్వే ఆధారంగానే టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.సర్వేలో ఏ అభ్యర్థి పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారో వారికే టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ఏ అభ్యర్థికి ఏ మేరకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు కారణాలేమిటీ, ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపే అంశాలేమిటీ అనే విషయాలను ప్రాతిపదికగా తీసుకొనే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
ఎఐసిసి నుండి టీమ్
ఎఐసిసి నుండి ప్రత్యేక టీమ్ను కూడ సర్వే నిర్వహించేందుకు దింపే యోచనలో ఉందని సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఈ టీమ్ సర్వేను నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.ఎఐసిసి టీమ్తో పాటు పీసీసీ కూడ ప్రత్యేకంగా మరో సర్వేను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ సర్వేను ఎఐసిసికి పంపనుంది. ఈ సర్వేలను సరిచూసుకొన్న తర్వాత అగ్రస్థానంలో ఎవరుంటే వారికి టిక్కెట్లను కేటాయించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Recommended Video
జూన్లో అభ్యర్థుల ఫైనల్ చేయనున్న కాంగ్రెస్
ఈ ఏడాది జూన్ మాసంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు చెప్పారు. రెండు సర్వేలను సరిచూసుకొన్న తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మరో వైపు ఈ రెండు సర్వేల్లో ఏదైనా అనుమానాలుంటే మరో సర్వే నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఈ సర్వేల ఆధారంగానే జూన్ లో అభ్యర్థులను ఫైనల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది.
55 ఏళ్ళు దాటితే టిక్కెట్టు కట్
55 ఏళ్ళు దాటితే టిక్కెట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోందని సమాచారం. దీనికి తోడు మరిన్ని మార్గదర్శకాలపై కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. వీటి ఆధారంగానే 2019 ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో 25 వేలకు మించిన ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి వారు 40 శాతం మంది ఉన్నట్లు పార్టీ గుర్తించింది.
50 వేల ఓట్ల తేడాతో ఓడితే టిక్కెట్టు దక్కదు
గత ఎన్నికల్లో 50 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైతే టిక్కెట్టు ఇవ్వకూడదనే అబిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టిక్కెట్టు కేటాయింపు విషయంలో కొన్ని విషయాలను ఆధారంగా చేసుకొని కొందరికి మినహయింపులు ఇచ్చే అవకాశం కూడ లేకపోలేదు. గతంలో పలు మార్లు విజయం సాధించినప్పటికీ, గత ఎన్నికల్లో ఓటమిపాలైతే అలాంటి వారికి టిక్కెట్టు కేటాయింపు విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు.
తక్కువ ఓట్లతో ఓడిపోతే టిక్కెట్లు గ్యారంటీ
గత ఎన్నికల్లో 2 నుండి 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైతే వారికి ఈ దఫా గ్యారంటీగా టిక్కెట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వరుసగా నాలుగైదు దఫాలు ఓటమిపాలైన అభ్యర్థులకు మాత్రం టిక్కెట్లు దక్కకపోవచ్చు.గత ఎన్నికల్లో నాలుగు, లేదా ఐదో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు టిక్కెట్లు దక్కకపోవచ్చు.