దొరా.. గమనిస్తున్నా, సర్వస్వం అప్పగించా: విజయశాంతి, కూలిన వేదిక, కిందపడిన రాములమ్మ
కొల్లాపూర్: తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ్యత, సంస్కారాన్ని మరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి శుక్రవారం విమర్శించారు. ఆమె కొల్లాపూర్ బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో నాలుగు వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ఎదురుచూశా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా, గుండెల్లో స్థానంలేదు: కేసీఆర్పై విజయశాంతి
ఇక్కడి ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గురించి తమకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. దొరా... గమనిస్తున్నాం.. దొరా... జర.. తగ్గు దొరా.. మీరు ఎవరిని విమర్శిస్తున్నారు దొరా... బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నారు.. విమర్శిస్తున్నారు దొరా.. అని విజయశాంతి.. కేసీఆర్ను ఉద్దేశించి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి చరిత్ర
టీఆర్ఎస్ చాలా చిన్న పార్టీ అని, దొరల పార్టీ అని, మీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి లేదని విజయశాంతి అన్నారు. మాతో పాటు మీరు కూడా ఉద్యమాలు చేశారని గౌరవించామని, నమ్మామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. ఎన్నో రాష్ట్రాలను పాలించిందని, స్వాతంత్ర్యం మొదలు తెలంగాణ ఇవ్వడం వరకు కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందన్నారు.
సోనియా గాంధీ తెలంగాణ దేవత
సోనియా గాంధీ తెలంగాణలో దేవత అయ్యారని విజయశాంతి అన్నారు. యువకులు, బడుగు, బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ముందుకు నడుస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రధాని అవడం ఖాయమని అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వీటి వల్ల ఎంతో మంది ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లిందన్నారు. కానీ తెరాస ప్రభుత్వం మాత్రం యువతను నడి రోడ్డుపై నిలబెట్టిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అన్ని సమస్యలు తీరుతాయి
ఉద్యోగాల కోసం తెలంగాణ సాధించుకున్నామని, కానీ ఉద్యోగాలు లేక అనేక మంది యువత ఆత్మత్యాగాలు చేసుకున్నారని, ఇలాంటి తెలంగాణ కోసమా మనం పోరాడిందని విజయశాంతి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడామని, కానీ అది ఇప్పుడు జరగడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పారు.
ఈ రాములక్క మీ కోసం నిలబడే మనిషి, సమస్తం అప్పగించా
ఈ రాములక్క మీ కోసం (ప్రజలు) నిలబడే మనిషి అని, మీకు మంచి చెప్పే మనిషి అని, మిమ్మల్ని ముందుకు నడిపించే, నా కుటుంబం అంటే తెలంగాణ అని విజయశాంతి అన్నారు. ప్రజలే మా కుటుంబం అన్నారు. నా కుటుంబం కోసం (తెలంగాణ కుటుంబం) సర్వం, సమస్తం అప్పగించానని, మీ కోసం పోరాడుతానని, మీకోసం నిలబడతానని.. అదీ రాములమ్మ అని చెప్పారు.
జూపల్లిపై డీకే అరుణ ఆగ్రహం
నాలుగుసార్లు గెలిపించినా జూపల్లి కృష్ణారావు ఇక్కడ అభివృద్ధి చేయలేదని డీకే అరుణ మండిపడ్డారు. జూపల్లి అదే ఆంధ్రా పాలకుల కింద జూపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాడనే విషయం మరిచిపోయారని ధ్వజమెత్తారు. జూపల్లికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కొల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జూపల్లి కమీషన్లకు కక్కుర్తి పడటంతో పూర్తి కాలేదన్నారు.
బ్యాంక్లో క్లర్క్గా చేసే జూపల్లిని మంత్రిని చేసింది కాంగ్రెస్
బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం చేసే జూపల్లిని ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని డీకే అరుణ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాగైతే మోసం చేశాడో జూపల్లి కూడా నాలుగుసార్లు మిమ్మల్ని మోసం చేశారన్నారు. జూపల్లి ఏమైనా అంటే గద్వాలకు వస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డీకే అరుణ అన్నారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు కేసీఆర్కు ఓసారి ఓటు వేశారని సరిపోయిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు. జూపల్లిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ స్టేజీ కూలింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతికి ప్రమాదం తప్పింది.విజయశాంతి వేదికపై నుంచి కిందపడ్డారు. అప్పుడు వేదికపై విజయశాంతి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు.
Recommended Video