పంజాబ్ ఫార్మూలాతో కాంగ్రెస్, అదే జరిగితే టిఆర్ఎస్ కు షాకే, ప్లాన్ ఇదే!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
హైదరాబాద్: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. రిజర్వ్ డ్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆ పార్టీ కేంద్రీకరిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అమలు చేసిన ఈ ఫార్మూలా ఫలితాన్ని ఇచ్చింది. దీంతో అదే తరహా పార్మూలాను తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ వ్యూహాంతో టిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తీరని వేదనను మిగిల్చింది. తెలంగాణలో అధికారానికి దూరం కావడానికి అనేక రకాల కారణాలున్నాయనే అభిప్రాయాలను మరికొందరు కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో చోటుచేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఏ రకమైన ప్లాన్ ను అమలు చేసినా అంతిమ లక్ష్యం మాత్రం అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చింది.
పంజాబ్ రాష్ట్రంలో అనుసరించిన వ్యూహం ఆ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చింది.అయితే అదే ఫార్మూలాను తెలంగాణలో కూడ అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది.
పంజాబ్ తరహా ప్లాన్ తెలంగాణలో అమలు
రిజర్వ్ డ్ అసెంబ్లీ స్థానాల్లో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సిద్దం చేస్తోంది. లీడర్ షిప్ డెవలప్ మెంట్ పేరుతో రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో బలపడాలనే వ్యూహన్ని అమలు చేసింది.ఈ వ్యూహాం పంజాబ్ రాష్ట్రంలో పనిచేసింది. దేశవ్యాప్తంగా ఇదే తరహా ప్లాన్ ను అమలు చేయనుంది. పంజాబ్ రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో ఈ ప్లాన్ ను అమలు చేస్తే 23 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.ఇదే ఫార్మూలాను తెలంగాణలో అమలు చేయనున్నారు.
31 నియోజకవర్గాల్లో కార్యకర్తలకు శిక్షణ
పంజాబ్ పార్మూలాను అమలు చేసేందుకుగాను తెలంగాణ రాష్ట్రంలోని 31 అసెంబ్లీ సెగ్మెంట్లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేశారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైద్రాబాద్ పాత జిల్లాలోని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు సమన్వయకర్తగా వ్యవహారించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఆయన ఇప్పటికే పర్యటించారు.ఈ నియోజకవర్గాల నుండి పదిమంది చొప్పున కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు. ఈ నియోజకవర్గాల్లోని రిజర్వ్ డ్ సామాజికవర్గాలను కాకుండా ఇతర బలమైన సామాజికవర్గాలను ఎంపిక చేసుకొంటారు.ఈ నియోజకవర్గాల నుండి సుమారు 310 మందిని ఎంపిక చేసుకొంటారు.
రాహుల్ గాంధీతో సమావేశం
ఎంపిక చేసిన కార్యకర్తలతో ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత వీరంతా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రతి గ్రామం నుండి ఐద నుండి పదిమందిని ఎంపిక చేసుకొని పార్టీ కోసం పనిచేసే విధంగా సిద్దం చేస్తారు.రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను పలు అంశాలపై చర్చించనున్నారు.
పార్టీ విస్తరణకు ప్లాన్ ఇదే
వీరంతా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడూ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ లేదా ఎమ్మెల్యే అభ్యర్థికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. పార్టీ విస్తరణతో పాటు, అభివృద్ది కార్యక్రమాలకోసం సలహాలను ఇస్తారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఆర్థికంగా ఎఐసిసి, టీపీసీసీ నుండి నేరుగా సహాయం అందించాలని కూడ నిర్ణయించారు.
పార్టీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ వ్యూహమిదే
పార్టీని బలోపేతం చేసేందుకుగాను రాహుల్ గాంధీ కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కూడ పార్టీని బలోపేతం చేసేందుకుగాను పలు సంస్కరణలను, వ్యూహాలను అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకొంది.ఎఐసిసి ఎస్ సి సెల్ ఛైర్మెన్ కొప్పులరాజు అన్ని రాష్ట్రాల్లో ఈ ఫార్మూలాను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు.