పొలిటికల్ కౌంటర్: అక్కడినుండే కాంగ్రెస్ ప్లాన్, టిఆర్ఎస్ కు దెబ్బేనా?
ఇటీవల మెదక్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో సభకు సమాయత్తమౌతున్నారు.ఉస్మానియా యూనివర్శిటీలో' నిరుద్యోగ గర్జన' పేరిట సభ నిర్వహించాలని
హైదరాబాద్: ఇటీవల మెదక్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో సభకు సమాయత్తమౌతున్నారు.ఉస్మానియా యూనివర్శిటీలో' నిరుద్యోగ గర్జన' పేరిట సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ నుండే టిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.అందుకే ఈ యూనివర్శిటీని వేదికగా ఎంచుకొంది.
రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ళపాలనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా విమర్శలు చేస్తోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాలను సన్నద్దం చేస్తున్నారు. అయితే మూడేళ్ళుగా స్ధబ్దుగా ఉన్న కార్యకర్తల్లో కదలిక తెచ్చేందుకు పలు కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారంచుట్టనుంది.
ఉస్మానియా యూనివర్శిటీలో సభ నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆ పార్టీ తలపెట్టింది.
ఓయూ వేదికగా కాంగ్రెస్ పార్టీ సభ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని విశ్వాసం తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతకు ఉంది. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలను ఎన్ని కల్పించారనే విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టిఆర్ఎస్ ను ప్రశ్నిస్తోంది. ఇదే అంశాన్ని తీసుకొని యువతలో చైతన్యం తీసుకురాలని ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ గర్జన పేరుతో సభ నిర్వహించాలని భావిస్తోంది.ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వనించాలని ఆ పార్టీ భావిస్తోంది.
సంస్థాగత ఎన్నికల తర్వాతే సభ
ఈ ఏడాది అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి.ఈ ఎన్నికల తర్వాత ఓయూలో లక్షమందితో ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.సంస్థాగత ఎన్నికల ముందే ఈ సభ నిర్వహించాలని భావించినప్పటికీ ఈ ఎన్నికల కారణంగా రాహుల్ ఈ సభకు రాకపోవచ్చని పార్టీ సీనియర్లు అభిప్రాయపడ్డారు.దీంతో సంస్థాగత ఎన్నికలు పూర్తైన తర్వాతే రాహుల్ సభను నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది.మరో వైపు ఈ సభ విషయమై పార్టీ సీనియర్లతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారని సమాచారం. వారు కూడ ఈ సభ నిర్వహణపై సానుకూలంగానే స్పందించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఉద్యోగాల భర్తీపై పూర్తివివరాలతో శ్వేతపత్రం
అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ళకాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేసిందనే విషయాలను సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని ఈ సభలో విడుదల చేయనుంది. గతంలో ఉన్న ఉద్యోగాలెన్ని, ఈ ప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగాలెన్ని అనే విషయాలను ప్రస్తావించనుంది.
అవసరమైనచోట రాహుల్ సభలు
రాష్ట్రంలో ప్రతి మూడు లేదా నాలుగు మాసాలకు రాహుల్ గాంధీ సభలను ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.మెదక్ సభ పూర్తి కావడంతో , ఆ తర్వాతి సభను ఉస్మానియా యూనివర్శిటిలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.సంగారెడ్డి సభను విజయవంతం చేసిన జగ్గారెడ్డికి ఈ బాద్యతలను అప్పగిస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడ పార్టీవర్గాల్లో ఉంది. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో కూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఈ సభపై చర్చించే అవకాశం ఉంది.