ఏడాది ముందే అభ్యర్థుల జాబితా, అధికారంలోకి వచ్చేవరకు గడ్డంతోనే, టిఆర్ ఎస్ కు చెక్ కు ఇలా..
ఏడాది ముందే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమౌతోంది. పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు తాను గడ్డం తీయబోనని ఆయన పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .
హైదరాబాద్ :వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమౌతోంది.ఈ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఓడించి గద్దెనెక్కాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తన వ్యూహలకు పదను పెడుతోంది.ఏడాది ముందే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.
వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన వ్యూహలను సిద్దం చేస్తోంది. ఈ మేరకు పార్టీ క్యాడర్ ను ఉత్సహపరిచే కార్యక్రమాలకు ఆ పార్టీ సన్నద్దమైంది.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్పటికీ తెలంగాణలో అధికారానికి ఆ పార్టీ దూరమైంది. అయితే దీనికి అనేక కారణాలున్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను ఈ దఫా పునరావృతం కాకుండా చూసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.
టిఆర్ ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా పార్టీ నుండి చాలా మంది నాయకులు అధికార పార్టీలో చేరారు . క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ కార్యాచరణను సిద్దం చేసింది.
ఏడాది ముందే అభ్యర్థులప్రకటన
ఏడాది ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ మేరకు అసెంబ్లీలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సిద్దం చేయాలని భావిస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బరిలో ఉన్న అభ్యర్థులకు కలిసివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేందుకు సరైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.
అధికారంలోకి వచ్చేవరకు గడ్డం తీయను
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు తాను గడ్డం తీయబోనని కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనకు తాను కట్టుబడే ఉన్నానని ఆయన వికారాబాద్ లో మీడియాకు ప్రకటించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు విశ్రమించబోనని ఆయన ప్రకటించారు.టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఈ నెలాఖరులో డిసిసి అధ్యక్షుల ప్రకటన
ఈ నెలాఖరులో డిసిసి అధ్యక్షుల జాబితాను ప్రకటించేందుకు పిసిసి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.అయితే కొత్త జిల్లాలతో పాటు పాత జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించే కసరత్తు సాగుతోంది.ఈ నెలాఖరుకు డిసిసి అధ్యక్షుల జాబితాను ప్రకటించేందుకు పిసిసి కసరత్తు చేస్తోంది.
క్షేత్రస్థాయిలో క్యాడర్ లో ఉత్తేజం కోసం ప్రయత్నాలు
క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను ఉత్తేజం నింపేందుకుగాను పిసిసి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఆందోళన కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను తీసుకొని ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్యక్రమాలను చేపడుతోంది కాంగ్రెస్.