ట్రంప్ గెలిచాడు, ఏమంటావు కెసిఆర్!: సర్వేపై జానారెడ్డి
ఎన్నికల్లో గెలుపు ఓటములకు సర్వేలు ముఖ్యం కాదని, ఆయా పార్టీలపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే విజయం చేకూరుస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షనాయకుడు కుందూరు జానారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపు ఓటములకు సర్వేలు ముఖ్యం కాదని, ఆయా పార్టీలపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే విజయం చేకూరుస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షనాయకుడు కుందూరు జానారెడ్డి చెప్పారు.తమ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. 2019 లో తాము అధికారంలోకి వస్తామన్నారాయన.హిల్లరీ క్లింటన్ గెలుస్తోందని సర్వేలు, మీడియా చెప్పినా ట్రంప్ విజయం సాధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అసెంబ్లీ ఆవరణలోని మీడియాహాల్ లో జానారెడ్డి సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రకటించిన సర్వేలపై ఆయన స్పందించారు. తనకు సర్వేలపై విశ్వాసం లేదన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించకుండా సర్వేల వల్ల ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.
టిఆర్ఎస్ ప్రకటించిన సర్వేలపై అధికార, విపక్షపార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఈ తరుణంలో సిఎల్పీ నేత జానారెడ్డి సర్వేలపై తనకు విశ్వాసం లేదంటే, మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సర్వేను తప్పుబట్టారు.
మరో వైపు తాము ప్రకటించిన సర్వే తప్పని నిరూపించేందుకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరింది.మొత్తంగా ఈ సర్వే రాష్ట్రంలో రాజకీయాన్ని మరింత వేడెక్కించింది.
హిల్లరీ గెలుస్తోందని సర్వేలు చెప్పినా ట్రంప్ గెలిచాడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలుస్తోందని సర్వేలు, మీడియా తీవ్రంగా ప్రచారం చేసిన విషయాన్ని సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి గుర్తుచేశారు. సర్వేలు, మీడియా ప్రచారానికి భిన్నంగా అమెరికాలో ట్రంప్ గెలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎవరెన్ని సర్వేలు చేసుకొన్నా ఎన్నికల వేళ ప్రజలిచ్చే తీర్పుపైనే ఫలితం ఉంటుందన్నారు జానారెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాసమస్యలపై కేంద్రీకరించకుండా సర్వేలపై కేంద్రీకరించడం వల్ల ప్రయోజనం ఏమిటన్నారు.
కాంగ్రెస్ కు మెదక్ సెంటిమెంట్
1978 లో ఇందిరాగాంధీ సంగారెడ్డి సభలో పాల్గొన్నారు. వాస్తవానికి ఆమె సాయంత్రం 6 గంటలకు సభలో పాల్గొనాల్సి ఉండగా తెల్లవారు జాము 3 గంటలవరకు ఆమె కోసం ప్రజలు నీరిక్షించారు.దీంతో చలించిపోయిన ఆమె మెదక్ నుండి పోటీచేయాలని నిర్ణయించుకొన్నారు.1977 లో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ ఓటమిపాలయ్యారు.1980 లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఆమె పోటీచేసి విజయం సాధించారు. తిరిగి ఆమె ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకొన్నారు. అయితే ఇందిరాగాంధీపై ఆనాడు ఎస్.జైపాల్ రెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు.1982 లో ఏఐసీసీ ఎన్నికలకు సంబంధించి రాజీవ్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సిద్దపేట సమావేశంలో పాల్గొన్నారు.ఈ సెంటిమెంట్ తోనే మెదక్ జిల్లాలో వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన పేరుతో బహిరంగసభను ఏర్పాటుచేస్తోంది.
సిట్టింగ్ లకు టిక్కెట్లిస్తే పోటీకి దూరం
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని , ఎన్నికల ఖర్చును కూడ పార్టీ భరిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ స్పందించారు.ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కెసిఆర్ టిక్కెట్లను ఇస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆయన సవాల్ విసిరారు.కెసిఆర్ సర్వే నిజమైతే సర్వేలో 4వ, ర్యాంకు వచ్చిన మాజీ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్యకు తిరిగి డిప్యూటీ సిఎం పదవిని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ సభతో బిజెపి, టిఆర్ఎస్ పతనం ఖాయం
రాహుల్ గాంధీ మెదక్ సభతో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీల పతనం ఖాయమని ఎఐసిసి కార్యదర్శి కుంతియా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కెసిఆర్ తప్పుడు సర్వేలు చేయించి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.