టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన .. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఆక్రోశం
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని వారు వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ఎల్పీ లో సీపీఎల్పీ విలీనం సమంజసమేనా ? ప్రజలేమంటున్నారు ?
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని తప్పుదారి పట్టించారని నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హన్మకొండ జంక్షన్ లో రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలను బలహీన పరిచే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
వరంగల్ లో రోడ్ పై బైటాయించి కాంగ్రెస్ ఆందోళన.. టీఆర్ఎస్ పై ఫైర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, కట్ల శ్రీనివాస్ తదితరులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలహీన పరచటం లో భాగంగానే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిందని వారు ఆరోపించారు .కాంగ్రెస్ పార్టీని వీడి పార్టీకి మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కి విన్నవించినా స్పీకర్ పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ ని విలీనం చేసిన నిన్నటి రోజును బ్లాక్ డే గా వారు అభివర్ణించారు. ఇక రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ వికృత రాజకీయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలనే నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్షమే లేని అసెంబ్లీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వెయ్యమని డిమాండ్ చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏ మాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిపోయింది . కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆక్రోశమే మిగిలింది.