కేటీఆర్ ఫామ్ హౌస్ కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు ..ఉద్రిక్తత .. అరెస్ట్ చేసిన పోలీసులు
కేటీఆర్ ఫాం హౌస్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాన్ని విఫలం చేశారు పోలీసులు. కేటీఆర్ ఫాం హౌస్ విషయంలో రాష్ట్రంలో దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణంపై ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేడు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన నేతలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ కేటీ ఆర్ ఫాం హౌస్ వివాదం
కేటీఆర్ ఫాం హౌస్ వివాదం తెలంగాణా రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. జన్వాడలో కేటీఆర్ అక్రమంగా ఫాం హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి ఫాం హౌస్ ముట్టడికి యత్నించటం, అక్కడ డ్రోన్ కెమెరాలతో వీడియో చిత్రీకరణ చెయ్యటంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టు రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీలో ఒకరోజు కాంగ్రెస్ నేతల సస్పెన్షన్
ఇక నేడు అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, వీరయ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు పంపించారు .
జన్వాడ కేటీఆర్ ఫాం హౌస్ కు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఇక ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జన్వాడలోని కేటీఆర్ ఫాం హౌస్ కు ర్యాలీగా బయలుదేరారు. మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలను నిర్మిస్తే అడిగే వాళ్ళు లేరా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు సబితానగర్ సర్కిల్ నుండి ర్యాలీ నిర్వహించాలని భావించి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
ర్యాలీకి అనుమతి లేదని వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపధ్యంలో పోలీసులకు, భట్టి విక్రమార్క, సీతక్కలతో వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ఆపిన కారణం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.111 జీవోను ఉల్లంఘించి ఫాం హౌస్ కట్టారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. భట్టి విక్రమార్క, పోడెం వీరయ్య, సీతక్క , జగ్గా రెడ్డి , శ్రీధర్ బాబు , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గండిపేట్ వద్ద వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.