టీఆర్ఎస్ నుంచి కాపాడుకునేందుకు బెంగళూరు రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాసేపట్లో 119 నియోజకవర్గాల్లోని 1821 అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. పార్టీల విషయానికి వస్తే మహాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి), తెరాస మధ్య పోటా పోటీ నెలకొని ఉంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకుంటే.. తమ ఎమ్మెల్యేలను తెరాస కొనుగోలు చేసే అవకాశముందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లెక్కింపు సరళిని పరిశీలిస్తూనే మరోవైపు తమ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులపై దృష్టి సారిస్తోంది. తెరాసకు మెజార్టీ రాకుంటే.. తమ పార్టీ నుంచి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.
షాకింగ్!: 'గజ్వెల్లో 50వేల ఓట్లతో ఓడిపోనున్న కేసీఆర్, డిపాజిట్ రాని పరిస్థితి'
తెలంగాణలో తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అవసరమైతే బెంగళూరు రిసార్టులకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తెరాసకు మెజార్టీ రాకుంటే... తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు కర్ణాటక కాంగ్రెస్ నేత, ట్రబుల్ షూటర్ శివకుమార్ను కూడా రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాసపై వివిధ రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన వారిని లాక్కునే ప్రయత్నాలు చేస్తారని చెప్పడంతో పాటు ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేస్తారని కూడా రెండు రోజులుగా ఆరోపిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలను కేటీఆర్ ముందే చెబుతున్నారని, అంటే ఈవీఎంలను తారుమారు చేసే అవకాశముందని గజ్వెల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్కు సాఫ్టువేర్ పైన అవగాహన బాగా ఉందని, దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడవచ్చునని అనుమానించారు.
కేటీఆర్ 106 సీట్లు గెలుస్తామని పక్కాగా చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని, పంట చేతికి వచ్చిన తరువాత అన్నదాత మాదిరి జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ప్రజల అనుమానాలను ప్రభుత్వం తొలగించాలన్నారు.