కాంగ్రెస్ సెల్ఫ్ గోల్: మోడీ బాటలో కేసీఆర్.. అక్కడ పటేల్ ఇక్కడ పీవీ..!
హైదరాబాద: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా పీవీ అనే పేరునే పక్కనబెట్టిన కాంగ్రెస్ ఉన్నపలంగా ఆ మహనీయుడు వేడుకలు ఘనంగా ఎందుకు నిర్వహిస్తోందనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసి అభివృద్ధి వైపు భారత్ను నడిపించిన ఈ ఆర్థిక సంస్కరణల పితామహుడిని కాంగ్రెస్ ఎందుకు దూరం పెట్టింది..? ఇప్పుడే ఆయనపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది..? అసలు పీవీ శతజయంతి వేడుకలను కాంగ్రెస్ సంపూర్ణ హృదయంతో నిర్వహిస్తోందా...
పీవీకి దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్లో దక్కలేదా..?
పీవీ నరసింహారావు... బహుభాషా కోవిదుడు. 16 భాషలు అనర్గళంగా మాట్లాడగల అపరమేధావి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశంలో రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. ఆ సమయంలో అంటే 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు పరుగులు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పీవీ తన ఠీవిని చాటారు. తన కేబినెట్లో మరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇది పక్కనబెడితే కాంగ్రెస్లో మాత్రం పీవీకి దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేదనేది చాలామంది రాజకీయ నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు చివరి రోజుల్లో కూడా తనకు ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదనేది సీనియర్ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇంత హఠాత్తుగా పీవీపై ఎందుకో కాంగ్రెస్కు ఎనలేని ప్రేమ వచ్చేసిందని ఆ పార్టీలో వారే గుసగుసలాడుకుంటున్నారు.
పీవీ ఆర్థిక సంస్కరణలను కొనియాడిన సోనియా
పీవీ నరసింహారావు నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే నాడు ప్రధాని పీఠాన్ని తెలుగు వ్యక్తి అధిష్టించనుండటంతో అప్పటి టీడీపీ అధ్య క్షుడిగా ఉన్న ఎన్టీరామారావు బరిలో తన అభ్యర్థిని పోటీకి నిలపలేదు. ఇతర పార్టీల వారే పీవీ నరసింహారావుకు అంత గౌరవం ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం ఆయన్ను విస్మరించిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అపట్లో సోనియాగాంధీకి పీవీ ప్రధాని కావడం అస్సలు ఇష్టం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు శతజయంతి వేడుకల సందర్భంగా ఆమె పీవీ నరసింహారావును కొనియాడటం నాడు దగ్గరగా ఉండి పరిస్థితులను చూసినవారిని విస్మయానికి గురిచేసింది. దేశం ఆర్థిక సంక్షోభం దిశగా వెళుతున్న సమయంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశాన్ని ప్రగతి వైపు నడిపించాయని సోనియా గుర్తుచేశారు.
పీవీ నరసింహారావు ఢిల్లీలో అవమానం
తెలంగాణ కాంగ్రెస్ పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోనియాతో పాటు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు ఆన్లైన్ ద్వారా తమ సందేశాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు పీవీపై కాంగ్రెస్ ప్రేమ కురిపించడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వారు మృతి చెందితే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్థీవదేహాన్ని ఉంచడం సాంప్రదాయం. కానీ 2004లో పీవీ నరసింహారావు ఢిల్లీలో మృతి చెందితే ఆయన పార్థీవదేహాన్ని కాంగ్రెస్ కేంద్రకార్యాలయంలో ఉంచేందుకు కూడా అనుమతించలేదని చాలామంది నాటి చేదు రోజులను గుర్తుచేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక మాజీ ప్రధానికి కాంగ్రెస్ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక హైదరాబాదులో కూడా పీవీ అంత్యక్రియలు జరగాల్సిన పద్దతిలో జరగలేదు. అయితే ఇప్పుడు పీవీని గుర్తుచేసుకుని ఏంలాభం అని ప్రశ్నిస్తున్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీవీ నరసింహారావును తన ఇంటికెళ్లి పలకరించారు నాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఇదికూడా హైకమాండ్కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
పీవీ కూతురుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ
ఇక తాజాగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సొంత పార్టీ కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా విస్మరించినప్పటికీ ఒక తెలుగుబిడ్డగా తెలంగాణ బిడ్డగా పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు గవర్నర్ కోటాలో పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని భావిస్తోంది. ఖాయమనే ప్రచారం ఉంది. తద్వారా పీవీ నరసింహారావు లెగసీని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వైపు లాగేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు ధీటుగా నిర్వహించిన పీవీకి నివాళి వర్చువల్ మీట్ కూడా అంతంత మాత్రంగానే సాగింది. సోనియా, ప్రణబ్, మన్మోహన్ సింగ్లాంటి వారు పాల్గొన్నా వారు మనస్ఫూర్తిగా ప్రసంగించినట్ల ు ఎక్కడా కనిపించలేదు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పీవీ శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు. దీని ద్వారా గతంలో పీవీకి జరిగిన అవమానాలు పరాభవాలను వారు పరోక్షంగా ప్రజలకు మరోసారి గుర్తుచేశారు.
Recommended Video
కాంగ్రెస్ భారతరత్న ఎందుకు ప్రకటించలేదు..
దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడమే కాదు.. చైనాతో మంచి సంబంధాలు నెలకొల్పడంలో పీవీ నరసింహారావు చేసిన కృషిని ఇప్పటికీ కొనియాడబడుతుంది. ఇక సార్క్ దేశాలతో వాణిజ్య ఒప్పందాల కుదుర్చుకోవడం, లుక్ ఈస్ట్ పాలసీ విధానం తీసుకురావడం అనేది తన బ్రయిన్ చైల్డ్గా చెబుతారు సీనియర్ విశ్లేషకులు. దేశంను పలు రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన మన తెలుగు ఠీవి పీవీకి మాత్రం కాంగ్రెస్లో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇదిలా ఉంటే పీవీ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డుతో గౌరవించింది మోడీ సర్కార్. మోడీ సర్కార్కు ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన పీవీ నరసింహారావుకు భారతరత్నతో గౌరవించుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.