"కడప పౌరుషం ఇదేనా.. నత్వానీని రాజ్యసభకు ఎలా పంపుతారు..విశ్వసనీయత ఎక్కడ": వీహెచ్
హైదరాబాద్: ఏపీలో రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు ఉండటంతో నాలుగు సీట్లు వైసీపీకి వచ్చినప్పటికీ తాము కూడా అభ్యర్థిని పోటీలో నిలుపుతున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఏపీలో మూడు సీట్లకు వైసీపీ అధినేత జగన్ సూచించిన అభ్యర్థులపై ఎలాంటి వివాదం లేకపోగా... నాలుగో అభ్యర్థిగా పెద్దల సభకు నత్వానీకి బీఫారం ఇవ్వడం ఇటు తెలంగాణలో కూడా కొంత వ్యతిరేక వాదన వినిపిస్తోంది.
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నత్వానీని తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నించారు సీనియర్ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు. నత్వానీ రాజ్యసభ అభ్యర్థిత్వంపై వీహెచ్ తన అభిప్రాయాన్ని వన్ఇండియాతో ప్రత్యేకంగా పంచుకున్నారు.
నాడు రిలయన్స్ పెట్రోల్ పంపులపై దాడులు
ఒకరిని ఒక్కసారిగా శతృవుగా చూసినప్పుడు ఎప్పటికీ శతృవులానే చూస్తారని అది కడప కల్చర్ అని వీహెచ్ అన్నారు. నాడు తన తండ్రి మరణానికి కారకుడైన రిలయన్స్ అధినేత అంబానీ అని అప్పుడు జగన్ అభిమానులు, వైయస్ అభిమానులు రిలయన్స్ పెట్రోల్ పంపులను, అంబానీ గ్రూప్కు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారని గుర్తు చేసిన వీహెచ్... ఇప్పుడు అదే అంబానీ సన్నిహితుడైన నత్వానీని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇది ఆంధ్రాలోనే ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు.
నాడు అంబానీపై విరుచుకుపడి..నేడు రాజీనా..?
జగన్ మనస్తత్వం తన తాతలాంటిదని తనకు ఎవరు ఎదురొచ్చినా అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తారని వీహెచ్ అన్నారు. కడప పౌరుషం గురించి మాట్లాడే వారు రాజీ పడటం విడ్డూరంగా ఉందని వీహెచ్ వ్యాఖ్యానించారు. జగన్కు దగ్గర వ్యక్తులు సన్నిహితులు నోరుమెదపలేక పోవచ్చు కానీ... సామాన్య ప్రజలు మాత్రం మాట్లాడుకుంటున్నారని వీహెచ్ చెప్పారు. తండ్రి మరణానికి కారణమైన వాడని నాడు అంబానీపై విరుచుకుపడ్డ వారే నేడు రాజీపడి అంబానీ సూచించిన వ్యక్తిని రాజ్యసభకు పంపడమేంటని ప్రశ్నించారు వీహెచ్. ఇదేనా కడప పౌరుషం అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాట తప్పను మడమ తిప్పను అని ...
మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే జగన్.. ఇప్పుడు ఎలా నత్వానీని రాజ్యసభకు పంపుతున్నారని వీహెచ్ సూటిగా ప్రశ్నించారు. నాడు తన తండ్రి మరణంపై అంబానీ హస్తం ఉందని దీనిపై సీబీఐతో విచారణ జరపాలని కోరిన జగన్... నేడు తన సన్నిహితుడు అయిన నత్వానీని రాజ్యసభకు పంపి మాటతప్పాడని ప్రజలు అనుకుంటున్నట్లు వీహెచ్ కామెంట్ చేశారు. అయితే నత్వానీకి సీటు ఇవ్వడం అనేదాన్ని సమర్థిస్తారా అన్న ప్రశ్నకు వీహెచ్ సమాధానం ఇచ్చారు. తన తండ్రి మరణం తర్వాత జగన్ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్న ఆలోచన వచ్చి ఉండొచ్చేమో అందుకే పాత విషయాలను పక్కనబెట్టి అంబానీ సూచించిన వ్యక్తికి సీటు ఇచ్చి ఉండొచ్చేమో అని వీహెచ్ చెప్పారు.
మొత్తానికి ముఖేష్ అంబానీ సూచించిన వ్యక్తి నత్వానీకి రాజ్యసభ సీటును జగన్ ఖరారు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీస్తుండగా... అసలు నత్వానీని రాజ్యసభకు ఎందుకు పంపారో అనేదానిపై కాలమే సమాధానం చెబుతుందని వీహెచ్ వ్యాఖ్యానించారు.