కేసీఆర్ కనబడుట లేదు... జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ మంత్రి... కాంగ్రెస్ విమర్శలు...
ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పీరియడ్లో ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల భారాన్ని మోపారని.. దానిపై వివరణ అడుగుదామన్న ఆయన అందుబాటులోకి లేకుండా పోయారని అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ అని... విద్యుత్ రంగంపై ఆయనకు పట్టు లేదని అన్నారు. కేసీఆర్కు సేవ చేయడం ఒక్కటే జగదీశ్ రెడ్డికి తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు.
బిల్లులు మాఫీ చేయాలన్న ఉత్తమ్
లాక్డౌన్ కారణంగా పేద కుటుంబాలు,ఎంస్ఎంఈలు పూర్తిగా నష్టపోయాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలు, ఎంఎస్ఎంఈల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పీరియడ్లో చాలామందికి రెట్టింపు కంటే ఎక్కువ బిల్లులు వచ్చాయని... ప్రభుత్వ ఆ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీపీఎల్ కుటుంబాల విద్యుత్ భారం ప్రభుత్వమే భరించాలన్నారు. టెలీ స్కోపిక్ విధానం ద్వారా బిల్లులు ఇచ్చే పద్దతిని తీసుకురావాలని... తద్వారా భారం తగ్గుతుందని చెప్పారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే పోలీసులు మాత్రం కాంగ్రెస్ నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. విద్యుత్ సౌధకు వెళ్లి సీఎండీ ప్రభాకర్ రావుకు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ... పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ బిల్లులపై స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.
ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కౌంటర్..
ఇక ఇటీవల కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గండి పడిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి దీనిపై స్పందించారు. కొండపోచమ్మ సాగర్లో తాను కాంట్రాక్టు పనులు చేశానని రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేకపోతే ఆరోపణలు చేసినవారు వారి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తనపై అసత్య ఆరోపణలు చేయటం తగదని హితవుపలికారు