మా ప్రాణాలకు ముప్పుంది, బెదిరింపు కాల్స్ వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు: కోమటిరెడ్డి
హైదరాబాద్: నల్గొండ మున్సిఫల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ హత్యలో టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని వెంకట్ రెడ్డి ఆరోపించారు.
హైద్రాబాద్లో సోమవారం నాడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మిర్చి బండి వద్ద గొడవ కారణంగానే కాంగ్రెస్ నేత మున్సిఫల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్తను హత్య చేశారని చెప్పడం సరికాదన్నారు వెంకట్ రెడ్డి.
పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తోందని సర్వే నివేదికలు వస్తుండడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కూడ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
కోదండరామ్ ప్రాణాలకు ముప్పు: విహెచ్
తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రాణాలకు ముప్పుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని కెసిఆర్ ప్రభుత్వం అణగదొక్కుతోందన్నారు. కెసిఆర్ విధానాలను ప్రశ్నించిన వారికి చావునే పరిష్కారంగా చూపుతున్నారని వి.హనుమంతరావు అన్నారు. కోదండరామ్ తో పాటు తన ప్రాణాలకు కూడ ముప్పుందని వి. హనుమంతరావు చెప్పారు.