ఆర్టీసీ బంద్కు సంపూర్ణ మద్దతు, అన్ని వర్గాలు సపోర్ట్ చేయాలన్న భట్టి
రాష్ట్రంలో పాలన కుంటుపడిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలనే సోయి ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. శనివారం ఆర్టీసీ కార్మిక జేఏసీ తలపెట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపించాలని కోరారు. రోడ్డు రవాణా వ్యవస్థ సమ్మెలో ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు. ఇది సరికాదని.. కార్మికుల సమస్యపై సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెలో అసంతృప్త అధికార నేతలు పాల్గొనాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. ప్రభుత్వం తరఫున నిల్చొంటే ప్రజలు గమనిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఆర్టీసీ, ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ బంద్ నేపథ్యంలో నాయకులను ముందుగా అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. త్వరలో కేంద్ర పెద్దలకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను వివరిస్తామని ఆయన తెలిపారు.
మరోవైపు బంద్ నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్తో సమావేశమయ్యారు. ఇప్పటికే బస్సులు నడుస్తోన్నందున మరిన్ని బస్సు ట్రిప్పులను తిప్పాలని చూస్తున్నారు. దీంతోపాటు బస్సుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో బస్సులు నడపాలని భావిస్తున్నారు.