తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 163, 164 ఏమిటో తెలుసా: ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
హైదరాబాద్: కేబినెట్ విస్తరణ జాప్యం వల్ల జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను అడ్డుకోలేక పోవడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్కు కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. టీఆర్ఎస్ సర్కారుకు గుడ్డిగా గవర్నర్ వత్తాసు పలకడం సరికాదన్నారు. ఆర్టికల్ 163, 164 ప్రకారం కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పంచాయతీ ఎన్నికల్లో మూడోవంతు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందడానికి కృషి చేసినకార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బేఖాతరు
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొనసాగాలంటే రాజ్యాంగ నిభంధనలకు లోబడి తప్పనిసరిగా క్యాబినెట్ విస్తరణ జరగాలని రాజ్యాంగం ప్రకారం కనీసం 12 మంది మంత్రులు ఉండాలని, రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకొని తక్షణమే కేబినెట్ మంత్రులను నియమించాలని దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మంత్రుల నియామకం ప్రజల ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశమన్నారు. రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ బేఖాతర్ చేస్తున్నారన్నారు. కనీసం రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణాలో ప్రభుత్వం నడవడం లేదని గవర్నర్కు తన పనితీరులో సహాయకులుగా ఉండాల్సిన మంత్రులు లేకపోవడం సరికాదని అన్నారు. సీఎం, హోంమంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేశారని హోంమంత్రికి ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని, ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు, పూజలు పునస్కారాల పేరిట కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే వత్తాసు
తెలంగాణాలో మొత్తం 33 శాఖలు, 298 ఆర్గనైజేషన్లు ఉన్నాయని, కాని ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారని, ఆయనకు నాలుగుశాఖలు మాత్రమే కేటాయించారని శ్రవణ్ అన్నారు. అయినప్పటికీ నిర్ణయాధికారం కేసీఆర్ చేతిలోనే ఉందన్నారు. కనీసం హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయించలేని హోంమంత్రి మినహా మరో మంత్రి లేకపోవడం దారుణమన్నారు. నిరంతరం మంత్రుల సలహాలు, సూచనలను అమలుచేయాల్సిన గవర్నర్ ఎవరి సూచనలు సలహాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో స్ఫష్టం చేయాలన్నారు. గవర్నర్ పట్టింపులేనట్టు వ్యవహరించడం వల్ల తెలంగాణాలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు. 33 శాఖల్లోంచి సమాచారం తెప్పించుకోవడం, రివ్యూలు చేయడం కేవలం ఒక్క ముఖ్యమంత్రి, హోంమంత్రి వల్ల కాదని, ఇవన్నీ ఒంటిచేత్తే చక్కబెట్టేందుకు సీఎం ఏమన్నా సూపర్ కంప్యూటరా అన్నారు. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో స్పష్టం చేయాలన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనను గవర్నర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నరో చెప్పాలన్నారు.
ఎవరి ప్రయోజనాలు నెరవేరుస్తారు
2014 తర్వాత అయిదేళ్ల పాటు సుస్థిరపాలన కొనసాగుతుందని భావించి ప్రజలు నమ్మకంతో ఓట్లేసి తెరాసకు అధికారం ఇచ్చారని, కాని అధికారంలోకి వచ్చింది మొదలు తన నియంతృత్వ ఆలోచనతో పాలన సాగించిన కేసీఆర్ అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు పోయారని శ్రవణ్ అన్నారు. దీంతో తొమ్మిది నెలల పాలన కుంటుపడిందన్నారు. మళ్లీ ఇప్పడు పంచాయితీ ఎన్నికలు, ఆతర్వాత ఎంపీటీసి, జెడ్పీటిసి, ఎంపీ ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికలు ఇలా ఏడాదంతా ఎన్నికలు ఉండడం వల్ల కోడ్ అమలులో ఉంటుందని ఇలాగయితే పాలన సజావుగా ఎలా సాగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కూడా మంత్రులను నియమించక పోవడం వల్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్నారు.
అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ
తెలంగాణా రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతోందని శ్రవణ్ ఆరోపించారు. డబ్బులు లేక వేల కోట్ల కాంట్రాక్టులు అన్నీ ఆగిపోయాయని చెప్పారు. ఒకటో తారీఖున రావాల్సిన ఫించన్లు సకాలంలో విడుదల చేయలేకపోతున్నారన్నారు. ఆర్ధిక మంత్రిని నియమించకపోతే బడ్జెట్ ఎవరు తయారు చేస్తారో స్పష్టత లేదన్నారు. ఒక పక్కన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని, ఇంతా జరుగుతున్నా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిన గవర్నర్ స్పందించక పోవడం సరికాదన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేశారని వాటన్నింటిని కొనసాగిస్తారా లేక వదిలేస్తారో తెలియడం లేదన్నారు. రైతు బంధు పథకానికి సంబంధించిన అంశంలో ఎన్నికల కు ముందు రైతులకు డబ్బులు వచ్చినట్లు మెసేజ్లు పంపారని కాని ఇంతవరకు ఎవరి ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు.
నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదిరి చూస్తున్నారని శ్రవణ్ అన్నారు. వారి సమస్యను నివారించే దిశగా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేదన్నారు. గవర్నర్ ప్రసంగం చూస్తే ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా ప్రభుత్వం ఏం చెబితే అదే వేదంగా నడుచుకుంటున్నట్టుగా ఉందన్నారు. తెరాస చెప్పినట్టు చేయడం వారికి కొమ్ముకాయడం గవర్నర్ వ్యవస్థను దిగజారుస్తుందన్నారు.
163, 164 ఆర్టికల్ ప్రకారం క్యాబినెట్ విస్తరణ వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న శ్రవణ్
ప్రభుత్వం మెడలు వంచి రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఆర్టికల్ 163,164 ప్రకారం క్యాబినెట్ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని శ్రవణ్ సూచించారు. కనీసం 12 మంది మంత్రులను నియమించేలా చూడాలన్నారు. రాజ్యాంగానికి కస్టోడియన్ అయిన గవర్నర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రాజ్యాంగ సాంప్రదాయాలను కాపాడాలని మొద్దు నిద్రను వీడాలన్నారు.
ఈవీఎంల హ్యాకింగ్ పైన
లండన్లో నిర్వహించిన హాకతాన్లో ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్లను హాకింగ్ చేయడం సాధ్యమేనని ప్రముఖ నిపుణుడు సయ్యద్ షుజా తేల్చారని, ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ప్రవేశ పెట్టాలని ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ఈవిఎంలు టాంపరింగ్ చేశారని వివిపాట్ స్లిప్పులు లెక్కించాలని తాము చేసిన విజ్నప్తిని ఎన్నికల కమీషన్ బేఖాతర్ చేసిందన్నారు. అలాగే సయ్యద్ షుజా చెప్పినట్లు హాకింగ్ వెనుక కుట్ర కోణం ఉందని గోపీనాధ్ ముండే, గౌరీలంకేశ్ హత్యల వెనుక ఉన్న గూడుపుఠాణీ వెలికి తీయాలన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను పల్లెపల్లెకు మోసుకు పోయి పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించుకున్నకార్యకర్తలనుశ్రవణ్ అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య నాయకులంతా ఓటమి బాధతో ఉన్నా కార్యకర్తలు మాత్రం ఎత్తిన జెండా విడవకుండా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగిరేలా చేశారన్నారు. బెదిరించి భయపెట్టి 800 పై చిలుకు ఏకగ్రీవం చేసినా పోటీచేసిన 1800 సర్పంచ్ స్ధానాల్లో 900 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. దీన్ని బట్టి చూస్తే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తెరాస దొడ్డి దారిన గెలిచిందని స్పష్టం అవుతోందన్నారు.