లోపలేస్తామన్న తలసానిపై ఆగ్రహం, గెలిచే దమ్ములేకే: మర్రి
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నాడు దుమ్మెత్తిపోశారు. తలసాని అధికార దాహంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టారీతిగా మాట్లాడితే, అభివృద్ధిని అడ్డుకుంటే విపక్షాలను లోపలేస్తామని తలసాని హెచ్చరించారు. దీనిపై పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గెలిచే దమ్ములేకే: మర్రి
సనత్ నగర్ నుంచి తిరిగి గెలిచే దమ్ములేకే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓట్లను తొలగిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఆధార్ పేరుతో ఓట్లు తొలగించారన్నారు. ప్రభుత్వం అక్రమాల పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రభుత్వం విద్యా రంగం పైన చిన్న చూపు చూస్తోందని దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ చేయడం లేదన్నారు. విద్యారంగంలో మతాన్ని చొప్పిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో నూతన విధానాలపై గాంధీ భవన్లో రేపు వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు.
చీప్ లిక్కర్ పాలకీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చీప్ లిక్కర్ పాలసీ కారణంగా యువత పక్కదోవ పట్టే అవకాశాలున్నాయన్నారు. దీనిపై మహిళలతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేయాలన్నారు.
మహిళా కాంగ్రెస్ నిరసన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు గన్ పార్కు వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. చీప్ లిక్కర్ తీసుకు రావొద్దని ప్రభుత్వానికి సూచించారు. బంగారు తెలంగాణ చేస్తారా లేక మద్యం తెలంగాణను చేస్తారా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కరవు, రైతు ఆత్మహత్యలు, చీప్ లిక్కర్ పైన చర్చ జరగాలన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం అన్న సర్కారు ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలన్నారు.