సినిమా చూపించి గెలిచారు: కెసిఆర్పై నిప్పులు, కేంద్రమంత్రి సమక్షంలో టిడిపిXటిఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు దుమ్మెత్తి పోశారు. టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేతలు డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వేర్వేరుగా మండిపడ్డారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు సినిమా చూపించి, ఆశ పెట్టి గెలిచారని ఎర్రవెల్లి ఎద్దేవా చేశారు. 2015లో తెరాస ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్ారు. 24 రకాల మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఆ పార్టీ సభ్యులు పార్లమెంటుకు వెళ్లారన్నారు.
పలు సందర్భాల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనేందుకు రూ.1000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవాన్ని గుర్తించి తెరాస ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గ్రేటర్ ప్రజలు తెలివైనవారని చెప్పారు.
జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే విద్యుత్, నీటి బకాయిలు మాఫీ చేశారన్నారు. మాఫీ చేస్తే ఇప్పటి వరకు చెల్లించిన వారికి కూడా నగదు తిరిగి ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఓటర్లను అధికార తెరాస మభ్యపెడుతోందని రావుల ఆరోపించారు. తెరాస పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారిందన్నారు.
చెంపపెట్టు: డికె అరుణ
తాజా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వానికి చెంప పెట్టు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డికె అరుణ అన్నారు. అధికారం ఉందని ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే తప్పన్నారు.
రాష్ట్రంలో అనేక చోట్ల తెరాసకు గెలిచే సత్తా, సంఖ్యాబలం లేకున్నా నోట్లు పడేసి ఓట్లు కొనుగోలు చేయవచ్చనని అభ్యర్థులను నిలిపిందని, చివరకు ధర్మం గెలిచిందన్నారు. ఈ విషయం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా ఫలితాల ద్వారా తేటతెల్లమయిందన్నారు.
గ్రేటర్ హైదరాబాదులో తెరాస అభద్రతను సృష్టిస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కొత్తగా చేసిందేమీ లేదన్నారు. సెటిలర్స్ పైన కెసిఆర్ది కపట ప్రేమ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వచ్చే వారితో పొత్తులు ఉంటాయన్నారు.
యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలి: మోత్కుపల్లి
నల్గొండ జిల్లాలోని యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రిని జిల్లా చేయాలని కోరుతూ లక్ష్మీనర్సింహ స్వామికి రేపు వినతిపత్రం ఇస్తామన్నారు. యాదాద్రిని సిద్దిపేటలో కలపాలనుకోవటం సరికాదన్నారు. తాము చేసేది రాజకీయ ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమమన్నారు.
ఉప్పల్లో టిడిపి, టిఆర్ఎస్ ఘర్షణ
కేంద్ర, రాష్ట్ర మంత్రుల సాక్షిగా హైదరాబాద్ ఉప్పల్లో టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణా రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు కలగజేసుకుని రమణా రెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు.
ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్న సమయంలో ఈ ఘర్షణ జరిగింది. ఉప్పల్లో రూ.160 కోట్ల నిధులతో చేపడుతున్న మంచినీటి రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎంపీ మాల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ క్రమంలో మంత్రులు మాట్లాడిన సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతున్న సమయంలో టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వేదికపై ఉన్న మంత్రి పద్మారావు టిడిపి కార్యకర్తల వైపు దూసుకెళ్లడంతో ఈ ఘర్షణ తలెత్తింది.