కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ... జైలుకు వెళ్లాల్సిన ఉత్తమ్ను పార్లమెంటుకు పంపింది టీఆర్ఎస్సే: లక్ష్మణ్
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది . తెలంగాణలో బిజెపిది గాలివాటం గెలుపన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు . తెలంగాణలో బిజెపి పాగా వేస్తుందన్న భయం ఉత్తమ్ కు పట్టుకుందన్న ఆయన కావాలనే బీజేపీ గెలుపును తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు .
ఆ ఎన్నికల్లో నా ఓటమికి కారణాలు అవే.. ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపిస్తా : రేవంత్ రెడ్డి
ఉత్తమ్ జైలుకు వెళ్ళాల్సిన వాడు .. పార్లమెంట్ కు పంపింది టీఆర్ఎస్ నే అన్న లక్ష్మణ్
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారని...అతన్ని జైలుకు పంపుతామని టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలోనే చెప్పింది . ఆ తర్వాత వారిమధ్య లోపాయికారి ఒప్పందం జరగడంతో అప్పుడు జైలుకు పంపుతామన్న పార్టీయే ఇప్పుడు పార్లమెంట్ కు వెళ్లడానికి సహకరించింది అని ఆరోపించారు లక్ష్మణ్ . నల్గొండలో ఉత్తమ్ టీఆర్ఎస్ అండతోనే గెలిచాడని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నాయకులు భ్రమలో బతుకుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని ఇకనైనా ఉత్తమ కుమార్ ప్రగల్బాలు పలకడం మానేయాలని లక్ష్మణ్ సూచించారు. ఓటమి అంచుల్లో నిలిచినా కాంగ్రెస్ నాయకులు ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా ఒక్క బిజెపికి మాత్రమే వుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కేసీఆర్ , బీజేపీ లోపాయికారిగా ఒప్పందం చేసుకుని పని చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలు గుపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ బీజేపీ గెలుపుపై వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తామని ధీమా .. టీఆర్ఎస్ కు షాకులు ఇవ్వబోతున్నామన్న లక్ష్మణ్
ఇప్పటికే తమ జాతీయాధ్యక్షులు తెలంగాణపై గురి పెట్టారని...అతి త్వరలో ఆ ఫలితాలు కనిపిస్తాయన్నారు లక్ష్మణ్ . తెలంగాణలో భవిష్యత్ మొత్తం బిజెపిదేనని...కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 38 శాతం బిజెపికే వచ్చాయని చెప్పిన ఆయన విద్యావంతులంతా బిజెపికి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచి తమ సత్తా ఏంటో చాటామన్నారు. ఏకంగా సీఎం కూతురు కవితను నిజామాబాద్ లో, ఆయన కుడిభుజం వినోద్ కుమార్ ను కరీంనగర్ లో ఓడించి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చామని చెప్పారు . ఇకపై ఇలాంటి షాక్ లు టీఆర్ఎస్ కు మరిన్ని ఇవ్వబోతున్నామని లక్ష్మణ్ తెలిపారు.