సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టు
తెలంగాణ అసెంబ్లీలో ఐటీఐఆర్ పై రగడ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అభివృద్ధి బాటలో పయనించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీఐఆర్ ను మంజూరు చేసిందని , అయితే ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు సాధించలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీని నిలదీశారు.
హుజూర్ నగర్ ఎన్నికల బరిలో శంకరమ్మ ? గులాబీ పార్టీ నుండి నో ఛాన్స్ !!
ఐటీఐఆర్ విషయంలో ప్రభుత్వం పై మండిపడ్డ భట్టి
ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీఐఆర్పై అధికార-ప్రతిపక్షం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కేటీఆర్ , భట్టి విక్రమార్క ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని పేర్కొన్న భట్టి విక్రమార్క ఐటీఐఆర్ వల్ల వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని నాటి యూపీఏ ప్రభుత్వం భావించిందని, ఐటీఐఆర్ వస్తే 70 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం జరిగేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, కేంద్రం పైన ఒత్తిడి తీసుకు రావడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం వల్లే ఐటీఐఆర్ నిర్వీర్యం అవుతోందని మండిపడ్డారు భట్టి విక్రమార్క.
ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన కురిసినట్టే అన్న భట్టి
ఐటీఐఆర్పై శాసనసభలో తీర్మానం చేయమని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ను మంజూరు చేసిందని గుర్తు చేసిన భట్టి విక్రమార్క ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రాజెక్టును సాధించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో కూడా ఐటీఐఆర్ కోసం తీర్మానంచేయాలని విజ్ఞప్తి చేసిన భట్టి ఐటిఐఆర్ విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గులాబీ మంత్రులు దేనికీ సమాధానం చెప్పరని , అరిచి కేకలు పెడతారన్న సీతక్క
ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రశ్నలు వారే అడుగుతారని సమాధానాలు కూడా వారే చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఏదైనా అడిగితే అరుస్తూ మాటల దాడికి దిగుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీతక్క సైతం డిమాండ్ చేశారు. ఇక ఐటీఐఆర్ పై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ ఐటీఐఆర్ ను మంజూరు చేస్తూ యూపీఏ ప్రభుత్వం ఒక కాగితం పారేసి పోయిందని మండిపడ్డారు.
ఐటీఐఆర్ అంశంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
వాళ్ళు ఏదో ఉద్దరిస్తే మేమేదో నాశనం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఐటీఐఆర్ విధానాన్ని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందని , ఇక ఐటీఐఆర్ మంజూరు చేసిన యూపీఏ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని తమ ప్రభుత్వం ఎదురు చూడలేదని పేర్కొన్నారు. మొత్తానికి ఐటిఐఆర్ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సభాపర్వంలో పెద్ద సమరమే జరిగింది.